Disha murder: ఒంటరిగానే నిందితులు.. చర్లపల్లి జైలు, షాద్నగర్లో భారీ భద్రత.. తీవ్ర ఉద్రిక్తతలతో
దిశ హత్య కేసు నిందితులున్న హైదరాబాద్లోని చర్లపల్లి సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణకు చెందిన వెటర్నరీ డాక్టర్ను అతిదారుణంగా లైంగికదాడి చేసి సజీవ దహనం చేసిన ఘటనలో నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దాంతో చర్లపల్లి జైలు, షాద్నగర్ కోర్టు, పోలీస్ స్టేషన్ వద్ద భారీగా నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసుల వెల్లడించిన ప్రకారం..
అన్ని వర్గాల నిరసనలతో
అత్యంత కట్టుదిట్టమైన చర్లపల్లి జైలు వద్ద గత కొద్దిరోజులుగా కొందరు సామాజిక కార్యకర్తలు, మహిళలు. విద్యార్థి, వైద్యులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే ఉరి తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసనను ఉధృతం చేశారు. దాంతో జైలు ముందు పోలీస్ పెట్రోల్ వాహనాలను మోహరింపజేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లే దారుల వద్ద పోలీసుల పహారాను ఉధృతం చేశారు. నలుగురు, ఐదుగురు కలిసి ఉండకుండా ఆంక్షలు విధించారు.
షాద్ నగర్ వద్ద
కాగా, దిశ హత్య కేసులో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని షాద్నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ నేపథ్యంలో కస్టడీ అవసరమని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దిశ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో షాద్ నగర్ కోర్టు వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకొన్నామని పోలీసులు పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్కు బారికేడ్లు
ఇక షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన కారులు నిరసనలు ఊపందుకొంటున్నాయి. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద బారికేడ్లు నిర్మించి సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. గత రెండు రోజులుగా పలు సంఘాల నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నది. పలు సందర్భాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకొంటున్నాయి.
పలకరించిన వారే లేరట..
దిశ కేసు నిందితులు మహ్మద్ అలీ అలియాస్ ఆరిఫ్, జే నవీన్, జే శివ, చెన్నకేశవులను చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. వీరి కోసం వారి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా చూడటానికి రాలేదని చర్లపల్లి పోలీసులు తెలిపారు. నవంబర్ 27న శంషాబాద్కు సమీపంలోని అవుటర్ రింగురోడ్డు వద్ద వెటర్నరీ డాక్టర్ దిశను దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన సంఘటన అందర్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.