అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ... ఈసారి ఎంత ఖర్చు చేశారో తెలుసా...
రాబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ పేదింటి ఆడపడుచులకు ప్రభుత్వం చీరల పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్లోని బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇంటికే పంపించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరీ అంచులతో చీరలను తయారు చేయించినట్లు... ఇందుకోసం రూ. 317.81 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తం కోటి చీరలను పంపిణీ చేయబోతున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో సిరిసిల్ల గోడలపై 'నేతన్న ధైర్యంగా ఉండు ఆత్మహత్యలు వద్దు' అనే కొటేషన్లు కనిపించేవన్నారు. ఉద్యమ సమయంలో నేతన్నల కష్టాలను కేసీఆర్ స్వయంగా చూశారని... ఒకే నెలలో ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే చలించిపోయారని చెప్పారు. అందుకే నేతన్నలకు పని కల్పించే ఉద్దేశంతో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రూ.1200 కోట్లు చేనేత జౌళి శాఖకు కేటాయించామన్నారు. నేతన్నలకు పని కల్పించే ఉద్దేశంతోనే ప్రతీ ఏటా కోటి బతుకుమ్మ చీరల తయారీకి కేసీఆర్ ఆదేశించారన్నారు.
2017లో బతుకమ్మ చీరల కోసం రూ.220 కోట్ల వెచ్చించగా... 2018లో రూ.280 కోట్లు,2019లో రూ.313 కోట్లు, 2020లో రూ.317.81 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ నాలుగేళ్లలో ఒక్క బతుకమ్మ చీరల కోసమే ప్రభుత్వం రూ.1033కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ప్రభుత్వ స్కూళ్ల యూనిఫామ్స్ కూడా చేనెత మగ్గాల ద్వారానే ఉత్పత్తి జరుగుతున్నాయన్నారు.అంగన్వాడీలు, ఇతర ఐసీడీఎస్ సిబ్బందికి చెందిన చీరలు, కేసీఆర్ కిట్లో ఇచ్చే చీరలు కూడా పవర్ లూమ్స్ ద్వారానే ఉత్పత్తి అవుతున్నాయన్నారు.
టీఆర్ఎస్ కృషితో రైతు, నేతన్న ఆత్మహత్యలు లేని రాష్ర్టంగా తెలంగాణ అవతరించిందన్నారు. నేతన్న భవిష్యత్ భద్రంగా ఉంటందని భరోసానిచ్చారు. తమ ప్రభుత్వానికి మతపరమైన ఎజెండాలు లేవని... అన్ని పండగలకు బట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు.