డీజేయస్ ర్యాలీ.. రాజాసింగ్ హెచ్చరిక.. అమ్మో..అంబర్ పేట..! ఆదివారం 'అక్కడ' ఏం జరగబోతోంది..?
హైదరాబాద్ : అంబర్ పేటలో రేపు ఏంజరగబోతోంది..? చిన్నపాటి వివాదం చినికి చినికి గాలివాన లాగా మారబోతోందా..? గత కొన్ని సంవత్సరాలుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకుంటూ సామరస్యంగా ఉన్న నగరంలో మళ్లీ మత కలహాలు చెలరేగనున్నాయా..? అంబర్ పేట లో చెలరేగిన వివాదం ఇంకా చల్లారకుండా ఉందంటే అది దేనికి సంకేతం..? పోలీసులు అక్కడ పికెంటింగ్ లు ఏర్పాటు చేసుకుని శాంతిభద్రతలను కాపాడుతున్నప్పటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడం పట్ల పలు సందేహాలు రేకెత్తుతున్నాయి.
పోలీసులు ఏమరుపాటుగా ఉంటే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. అంతే కాకుండా వివాదాస్పద అంబర్ పేట ప్రాంతంలో దర్స్ గా జిహాదీ ఓ షహాదత్ (డీజేయస్) అనే ముస్లిం మత సంస్థ నాయకులు ఆదివారం ర్యాలీ చేపడతామని ప్రకటించడంతో పోలీసులతోపాటు నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు.
అసలే పవిత్ర రంజాన్ మాసం కావడంతో వేల సంఖ్యలో ముస్లిం సోదరులు రోడ్లమీదకు వస్తే అదుపు చేయడం సాద్యమేనా అనే సందేహాలు చెలరేగుతున్నాయి. దీనికి తోడు డీజేయస్ ర్యాలీకి వ్యతిరేకంగా బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ హిందూ వాదులతో అదే అంబర్ పేట లో మరో ఊరేగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ఆదివారం రోజునే డీజేయస్ ర్యాలీతో పాటు రాజాసింగ్ నిరశన ర్యాలీ ఉంటుందని చెప్పడంతో నగర ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నట్టు తెలుస్తోంది.
రంజాన్ మాసంతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నయి. ఫలితాల సమయం కూడా దగ్గర పడుతోంది. ఇలాంటి తరుణంలో శాంతిభద్రతలు అదుపు తప్పితే పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆదివారం రోజున అంబర్ పేటలో డీజేయస్ తో పాటు రాజాసింగ్ ర్యాలీ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐతే రేపు అంటే 12వ తారీఖు ఆదివారం రోజున అంబర్ పేటలో గాని, దాని పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలకు గానీ, ప్రదర్శనలకు గానీ, నిరసన కార్యక్రమాలకు గాని అనుమతులు లేవని హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ ఆదేశాలు జారీ చేసారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.