చింతమడకకు 200 కోట్లా.. రాష్ట్రానికి సీఎం కాదా.. కేసీఆర్పై డీకే అరుణ ఫైర్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సొంతూరికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడం వివాదస్పదంగా మారుతోంది. ఇటీవల చింతమడక గ్రామానికి వెళ్లిన కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆ గ్రామాన్ని బంగారు తునకలా మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ క్రమంలో విపక్ష నేతలు కేసీఆర్పై మాటల యుద్దానికి దిగుతున్నారు. బీజేపీ నేత డీకే అరుణ మరో అడుగు ముందుకేసి తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించారు.
కేసీఆర్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారా.. లేదంటే చింతమడక గ్రామానికి ముఖ్యమంత్రిగా ఫీలవుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు అరుణ. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ గ్రామాలను సమాన దృష్టితో చూడాలని కోరారు. తాను పుట్టిన ఊరికి లబ్ది చేకూరేలా వరాల జల్లు కురిపిస్తే మరి మిగతా గ్రామాలు ఏం కావాలే అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ మానస పుత్రికకు అరుదైన గౌరవం.. అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం
తాను పుట్టి పెరిగిన ఊరు చింతమడకలో ఒక్కో ఇంటికి 10 లక్షల రూపాయల లబ్ధి చేకూర్చుతామంటూ కేసీఆర్ ఇచ్చిని హామీలను అరుణ ఖండించారు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో సొంత గ్రామాలను మాత్రమే అభివృద్ది చేసుకున్నారని అప్పటి ముఖ్యమంత్రులను ప్రశ్నించిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన చేస్తున్నదేంటోనని ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ చింతమడకకు వరాల జల్లు కురిపించిన రీతిలో అలా ఎన్ని గ్రామాలను అభివృద్ది చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఫైరయ్యారు. ఇంతవరకు చాలామందికి అసలు రైతుబంధు సాయమే అందలేదని ధ్వజమెత్తారు. సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాలకు మాత్రమే వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అదలావుంటే గతంలో ఆయనను ఎంపీగా గెలిపించిన పాలమూరును ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు.