తెలంగాణ తెచ్చుకుంది తన కుటుంబం కోసమా.? ప్రజల కోసమా..? కేసీఆర్ పై మండిపడ్డ డీకే అరుణ..!!
Recommended Video
హైదరాబాద్ : గులాబీ బాస్ పై బీజేపి నాయకురాలు డీకే అరుణ మరోసారి మండి పడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదని అరుణ ఘాటుగా విమర్శించారు. గడిచిన ఆర్నెళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. అంతేగాక నిధుల విషయంలో సర్పంచ్కు, ఉప సర్పంచ్కు మధ్య కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ప్రజలు గుణపాఠం చెప్పే సమయం తప్పకుండా వస్తుందని స్పందించారు.
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సర్పంచ్ హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. తలా తోక లేని పార్టీగా కాంగ్రెస్ మారిందని, కనీసం వారి నాయకులను కాపాడుకునే పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. 2023 కల్లా రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా అవతరించనుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్యంగా నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ఊపును భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.
దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీనికి కేంద్రం నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోంది. బీజేపీ ఇటీవల చేపట్టిన సభ్యుత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో.. అమిత్ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం.