వరుస క్రమంలో కార్లు నిలిపితే టోల్ ఛార్జ్ ఉండదు..! ఓఆర్ఆర్ లో వినూత్న ప్రయోగం..!!
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ లో ప్రయాణిస్తున్న వారికి శుభవార్త..! ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ ఛార్జీల చెల్లింపు నిరీక్షణకు తెరపడనుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఛార్జీలు చెల్లించకుండానే దూసుకెళ్లొచ్చు. 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకటే టోల్ వరుసలో నిరీక్షిస్తుంటే ఈ నిబంధనను వర్తింపజేయాలని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) తాజాగా నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలంటూ టోల్ ఛార్జీలను వసూలు చేసే సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
20 కంటే ఎక్కువ వాహనాల వరుస ఉంటే టోల్ అక్కర్లేదు..! ఏప్రిల్ 1 నుండి అమలు..!!
ముంబయి, నాగ్పుర్, వరంగల్, విజయవాడ, బెంగళూరు వైపే వెళ్లే జాతీయ రహదారులతో ఓఆర్ఆర్ను అనుసంధానం చేయడంతో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ప్రతి రోజు సగటున 1.25 లక్షల వాహనాలు వెళుతున్నాయి. పండగలు, వరుస సెలవులు వస్తే టోల్ చెల్లింపు కేంద్రాల దగ్గర వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వాహనాలు బారులు తీరుతున్నాయి. గంటల కొద్దీ టోల్ చెల్లింపు కేంద్రాల వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంక్రాంతి పండగ సమయాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టోల్ రుసుములను వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాలేదు.
కొత్త నిబంధన పక్కాగా అమలు చేయాలి..! టోల్ సంస్థలకు హెచ్ఎండిఏ ఆదేశాలు..!!
టోల్ వసూలులో జాప్యం తగ్గించేందుకు అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన టోల్ మేనేజ్మెంట్ సిస్టం(టీఎంఎస్)ను అమలు చేయాలని గతంలో హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఆ బాధ్యతను ఓ ప్రైవేట్ లీజ్ సంస్థకు అప్పగించగా, ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. మూడు నెలల కిందట 180 టోల్ లైన్లలో 69 టోల్లైన్లను ‘స్మార్ట్'గా మార్చింది.
టోల్ చెల్లింపు కేంద్రాల దగ్గర జాప్యాన్ని తగ్గించాలి..! హెచ్ఎండిఏ వినూత్న ప్రయోగం..!!
ఫాస్ట్ ట్యాగ్ల వినియోగంపై వాహనదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేకపోయింది. దీంతో వీటి వినియోగాన్ని పెంచలేక పోయింది. ఈ నేపథ్యంలో టోల్ చెల్లింపు కేంద్రాల దగ్గర జాప్యాన్ని తగ్గించేలా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనను అమలు చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. పగలు, రాత్రి సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే ఒక్కో టోల్ వరుసలో 20 కంటే ఎక్కువ వాహనాలు నిరీక్షిస్తుంటే ఎలాంటి టోల్ ఛార్జీలను వసూలు చేయకుండానే, వాటిని అక్కడి నుంచి పంపించేలా చర్యలు తీసుకోవాలని టోల్ వసూల్ చేసే సంస్థకు స్పష్టం చేశారు.
ఔటర్ ప్రయాణికులకు వెసులుబాటు..! ఎంతో సమయం ఆదా..!!
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నానక్రాంగూడ, శంషాబాద్ ఇంటర్ఛేంజ్ల దగ్గర అదనంగా మరిన్ని టోల్ లైన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనతో వరుస సెలవులు, పండగల సమయంలో టోల్ చెల్లింపు కేంద్రాల దగ్గర గంటల కొద్దీ నిరీక్షించాల్సిన బాధ వాహనదారులకు తప్పనుంది. దీంతో వాహన దారులకు పెద్ద యెత్తున సమయం ఆదా అవుతుందని, గంటలు గంటలు టోల్ దగ్గర సమయం వ్రుధా చేసుకోవాల్సిన అవసరం ఉండదని హెచ్ఎండీయే అదికారులు స్పష్టం చేస్తున్నారు.