వైద్యో 'ప్రాణ హరి'.. "వామ్మో ఆసుపత్రులు"
వైద్యో నారాయణ హరి అంటుంటారు పెద్దలు. కనిపించని దేవుళ్లకన్నా ప్రాణం పోసే డాక్టర్లను దేవుళ్లుగా భావించాలనేది దాని సారాంశం. కానీ మారుతున్న కాలంలో వైద్యుల నిర్లక్ష్యం చూస్తుంటే.. వారి చేతిలో రోగుల ప్రాణాలు హరిమంటున్నాయి. వైద్యుల సేవాలోపం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. తాజాగా నిమ్స్ ఆసుపత్రిలో వెలుగుచూసిన నిర్లక్ష్యం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులే కాదు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ అదే తంతు. కాసుల కక్కుర్తి మీద ఉన్న శ్రద్ధ పేషెంట్ల ఆరోగ్యంపై లేదనే ఆరోపణలు కొకొల్లలు.
ఇంత నిర్లక్ష్యమా?
వైద్యం గాడి తప్పుతోంది. డాక్టర్ల నిర్లక్ష్యం రోగులకు ప్రాణసంకటంలా మారుతోంది. ప్రైవేట్, గవర్నమెంట్.. ఆసుపత్రి ఏదైనా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ లో పెద్దాసుపత్రిగా పేరుపొందిన నిమ్స్ లో వెలుగుచూసిన ఘటన కలకలం రేపింది. కొన్నాళ్ల కిందట హెర్నియా సమస్యతో నిమ్స్ కు వచ్చిన ఓ మహిళకు సర్జరీ చేసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర మరచిపోయారు. ఆపరేషన్ అయిపోయింది ఇంటికి వెళ్లాడంటూ డిశ్చార్జ్ చేశారు. కొద్దిరోజుల తర్వాత కడుపునొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది.
కడుపులో కత్తెర్లు.. వామ్మో ఆసుపత్రులు
కడుపులో కత్తెర్లు మరచిపోవడమే కాదు చాలా సందర్బాల్లో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందనే సందర్భాలు అనేకం. డబ్బుల కోసం వివిధ పరీక్షల నిమిత్తం రోజులకొద్దీ పేషెంట్లను ఆసుపత్రుల్లోనే ఉంచుకుంటున్నారు. డిశ్చార్జి ఎప్పుడు చేస్తారని అడిగితే పెద్ద డాక్టర్ చెప్పాలని బదులిస్తారు సిబ్బంది. ఇలాంటి సన్నివేశాలు కొకొల్లలు.
ఇటీవల కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగుల బంధువులు విధ్వంసానికి దిగిన సందర్భాలున్నాయి. లక్షల రూపాయలు తీసుకుని తమ వాళ్ల ప్రాణం తీశారంటూ ఆందోళనకు దిగారు. కత్తెర్లు మరచిపోవడం, కుట్లు సరిగా వేయకపోవడం, వైద్య పరీక్షల్లో తప్పులు.. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం జాడలు కనిపిస్తున్నాయి. అటు ప్రైవేట్ ఆసుపత్రులపై ఇటీవల పోలీస్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందనే వాదనలున్నాయి.
కడుపునొప్పా.. కోసుడే మరి
2017లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అపెండిక్స్ ఆపరేషన్ల భాగోతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. చివరకు ప్రభుత్వ జోక్యంతో డొంక కదిలింది. ప్రధానంగా జగిత్యాల జిల్లాలో జరిగిన కడుపు కోతలు విస్మయం కలిగించాయి. కడుపునొప్పి అని వస్తే చాలు.. ఛలో ఆపరేషన్ థియేటర్ అంటూ అడ్డగోలుగా సర్జరీలు చేశారు. మందుబిళ్లతో తగ్గిపోయే కడుపునొప్పి కేసుల్లోను అడ్డదిడ్డంగా వ్యవహరించారు అక్కడి ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు. కేవలం డబ్బులకు ఆశపడి అభం శుభం తెలియని వందలాది చిన్నారుల కడుపులపై కత్తెర గాటు వేశారు. ఆ కేసులో కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు ఊచలు లెక్కించాల్సి వచ్చింది.
అంతులేని నిర్లక్ష్యం.. చర్యలేవీ?
నిమ్స్ లో ఓ రోగికి అప్పట్లో వెన్నెముకకు సంబంధించిన సమస్యకు సర్జరీ చేశారు. దాంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో కోటి రూపాయల పరిహారం ఇవ్వాలనే ఆదేశాల మేరకు నిమ్స్ అంత మొత్తం సమర్పించుకుంది. కొన్ని సందర్భాల్లో వైద్యుల నిర్లక్ష్యంపై కేసులు పెడుతున్నా.. వారికి శిక్ష పడుతోందా లేదా అన్నది ప్రశ్నార్థకమే. అప్పట్లో సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఆరుగురికి చూపు పోగా.. మరో ఏడుగురికి చూపు మందగించింది. ఆ విషయంలో ఇంతవరకు డాక్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇక నిలోఫర్ ఆసుపత్రిలో గతేడాది అయిదుగురు బాలింతలు మృత్యువాత పడ్డారు. సర్జరీ సందర్భంగా తీవ్ర రక్తస్రావం కావడానికి.. వైద్యుల నిర్లక్ష్యం కారణమనే విషయం బయటపడింది. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు వైద్యులను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు ఉన్నతాధికారులు. తర్వాత దాని ఊసే లేకుండా పోయింది. ఇలా ఎన్నో ఘటనల్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడుతున్నా.. సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
అదలావుంటే సిబ్బంది కొరత, వైద్యుల మధ్య ఆధిపత్య పోరు వెరసి ప్రభుత్వాసుపత్రులు అప్రదిష్ట మూటగట్టుకుంటున్నాయి. సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామంటూ ప్రభుత్వం ఓవైపు విస్తృతంగా ప్రచారం చేస్తుంటే.. వైద్యులు, సిబ్బంది తీరు మాత్రం కళంకం తెచ్చిపెడుతోంది.