ఓటరన్నకు కోపమొచ్చిందా?.. పోలింగ్ శాతం భారీగా ఎందుకు తగ్గింది?
హైదరాబాద్ : ఓటరన్నకు కోపమొచ్చిందా?.. నేతలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందా? ఓట్ల పండుగ వేళ కనిపించే దండమెట్టే లీడర్లు.. గెలిచాక ఐదేళ్లు కనిపించకుండా పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోందా?.. ఎన్నిసార్లు ఓటేసినా, ఎవరు గెలిచినా.. తమ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందనేది ఓటర్ల మనోగతమా?.. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు ఈసారి తగ్గిన పోలింగ్ శాతం సమాధానంగా కనిపిస్తోంది.
తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గిందా?.. 2014లో ఎంత..! 2019లో ఎంత?
ఓటర్లు దూరం
తెలంగాణ లోక్సభ ఎన్నికలు విస్మయం కలిగిస్తున్నాయి. పోలింగ్ శాతం భారీగా తగ్గడం నేతల్లో కలవరం రేపుతోంది. 2014 ఎన్నికల్లో 70.75 నమోదైన పోలింగ్ శాతం.. ఈసారి అనూహ్యంగా 62.25 శాతానికే పరిమితమైంది. ఒక్క పర్సంటేజీ తగ్గితేనే గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంటుంది. అలాంటిది 2014తో పోల్చితే ఈసారి 8.50 శాతం ఓటింగ్ తగ్గడం విస్మయం కలిగిస్తోంది. అయితే ఎన్నికలకు ఓటర్లు దూరంగా ఉండటానికి సవాలక్ష కారణాలున్నాయి.
8 స్థానాల్లో ప్రజాగ్రహం.. సీఎం ఇలాకాలో కూడా.!
నేతలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందనడానికి ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికలు నిదర్శనంగా కనిపించాయి. తమ సమస్యలను లీడర్లు పట్టించుకోకుండా పరిష్కారం చూపెట్టడం లేదనే ఆరోపణలు వినిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్సభ సెగ్మెంట్లకు జరిగిన ఎన్నికల్లో.. సగానికి సగం అంటే 8 స్థానాల్లో ప్రజాగ్రహం వ్యక్తమైంది.
సీఎం కేసీఆర్ ఇలాకా మెదక్ తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, చేవెళ్ల, మహబూబ్నగర్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లోని 15కు పైగా గ్రామాల ప్రజలు ఓటింగ్ ను బహిష్కరించడం గమనార్హం. అయితే కొన్ని గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో పోలింగుకు దూరంగా ఉంటే.. కొన్ని గ్రామాల్లో మాత్రం సాయంత్రం నుంచి ఓట్లు వేయడం కనిపించింది.
సమస్యలకు పరిష్కారమేది?
మెదక్ జిల్లాలోని అవుసుల పల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లాలోనూ మరికల్ మండలం తిలేరు గ్రామ ప్రజలు ఓటింగ్ ను బహిష్కరించారు. పోలింగ్ కు ఒకరోజు ముందు మట్టిదిబ్బలు విరిగిపడి ఏకంగా 10 మంది కూలీలు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. నేతలెవరూ పరామర్శించడానికి రాలేదనో, మరే ఏ ఇతర కారణమో తెలియదు గానీ ఓటేయ్యడానికి గ్రామస్థులు ఇంట్రెస్ట్ చూపించలేదు.
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతగిరి పల్లి తాండాకు చెందిన ఓటర్లు కూడా ఓట్లు వేయలేదు. ఏళ్లతరబడి తాగునీటి సమస్య ఎవరూ తీర్చడం లేదని.. ఎవరికి ఓటేసినా ప్రయోజనం లేదని తీర్మానించారు. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని బంధంపల్లి గ్రామస్థులు కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దనే డిమాండ్ నేతలకు తెలియజేయడానికే ఓట్లు వేయలేదని సమాచారం.
3-4 నెలల్లో అంత మార్పా?
దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ సెగ్మెంట్ లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు బరిలో నిలిచారు. పసుపు బోర్డు తీసుకురాకపోవడం.. బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించకపోవడం కవితకు పెద్ద మైనస్ గా మారాయి. అక్కడ 2014లో 68.61 శాతం పోలింగ్ నమోదైతే.. 14.41 శాతం మేర తగ్గి ఈసారి 54.20 శాతం ఓట్లు పోల్ కావడం గమనార్హం. అదలావుంటే పోలింగ్ సమయంలో ఓటేయ్యడానికి వెళ్లిన కవితకు చేదు అనుభవం ఎదురైంది. ఐదేళ్లు కనిపించకుండా పోయావంటూ క్యూ లో నిల్చున్న మహిళా ఓటర్లు నిలదీశారు.
లోక్సభ ఎన్నికల వేళ నేతల తీరుపై, ప్రభుత్వాల పనితీరుపై ఓటర్లలో కొంత అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపించింది. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన పోలింగ్ శాతం నమోదైంది. ఆ ఎన్నికలు జరిగి 3-4 నెలలు మాత్రమే అవుతోంది. ఇంతలోపే ఓటర్లలో అంత మార్పా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.