రాజన్న రాజ్యం వద్దు.. రామరాజ్యమే కావాలి, షర్మిల పార్టీపై అర్వింద్ రియాక్షన్
వైఎస్ షర్మిల పార్టీ పెడతానని ప్రకటించడంతో రాజకీయ ప్రకంపనలు నెలకొన్నాయి. పార్టీ పేరు వైఎస్ఆర్ టీపీ అని, ఏప్రిల్ 10వ తేదీన ఆవిర్భావం అని రకరకాల ఊహాగానాలు నెలకొన్నాయి. దీనిపై నేతలు స్పందిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇక్కడి ప్రజలు రాజకీయ పార్టీ ఏర్పాటును కోరుకోవడం లేదని చెప్పారు.
సిస్టర్ షర్మిల పార్టీ పెడతానని తెగ హడావుడి చేస్తున్నారని అరవింద్ అన్నారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. రామరాజ్యం కావాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ జమానా అయిపోయిందని, ఆయుస్మాన్ భారత్ జమానా వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రస్తావించి.. బీజేపీ వైపు ప్రజలు ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే తెలంగాణలో అవినీతికి తావులేదని తేల్చిచెప్పారు.
మోడీలా క్లీన్ గవర్నమెంట్ కావాలని షర్మిలకు చెబుతానని అర్వింద్ తెలిపారు. ఇన్నీ చెప్పిన తర్వాత కూడా పార్టీ పెడితే చేసేదేమీ లేదన్నారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం తప్ప అని సెటైర్ వేశారు. రాజకీయ పార్టీ పెడతానని షర్మిల ప్రకటించిన వెంటనే అన్నీ పార్టీల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అందులో భాగంగా అర్వింద్ కామెంట్ చేశారు.