మైనర్ బాలికకు వల.. రంగంలోకి ప్రైవేట్ డిటెక్టివ్స్.. అడ్డంగా బుక్కైన కేంద్ర ఉద్యోగి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దారి తప్పాడు. అమ్మాయి కోసం ఆరాటపడి కటకటాలపాలయ్యాడు. మైనర్ బాలిక అనే ఇంగీత జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. వెంటపడటమే గాకుండా.. అమ్మాయి వివరాల కోసం ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించాడు. చివరకు విషయం కాస్తా బయటపడటంతో పోలీసుల చేతికి చిక్కాడు. నాన్బెయిల్బుల్ సెక్షన్ల కింద జైలు పాలయ్యాడు.
వెంటపడ్డాడు.. అమ్మాయి పట్టించుకోలేదు..!
హైదరాబాద్ శివారు బాలాపూర్ ప్రాంతంలోని త్రివేణి నగర్ కు చెందిన దేవాంగ మహేశ్ కుమార్ డీఆర్డీవో లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పని చేస్తున్నాడు. చైతన్యపురికి చెందిన మైనర్ బాలిక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెను ప్రతినిత్యం ఫాలో అవుతూ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి అతడిని పెద్దగా పట్టించుకోలేదు.
ఓటరు దేవుడు హాలీడే ట్రిప్ కు వెళితే !? ఎన్నికల వేళ పార్టీలకు పెద్ద టెన్షన్ !
డిటెక్టివ్ ఏజెన్సీతో ఒప్పందం
అదలావుంటే, ఆ అమ్మాయి వివరాల సేకరణ కోసం స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదించాడు మహేశ్. అతను వెంటపడుతున్న అమ్మాయి వివరాలు కావాలని కోరాడు. దాంతో సదరు నిర్వాహకులు సరేనంటూ 17వేల రూపాయల ఫీజు తీసుకుని పని ప్రారంభించారు. మహేశ్ కోరిన మేరకు.. ఆ అమ్మాయి చదువుతున్న కాలేజీకి వెళ్లి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న సందర్భంలో అడ్డంగా బుక్కయ్యారు.
అలా చేయడం చట్టవిరుద్ధం కావడంతో.. డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకుడు చిక్క కిరణ్కుమార్ తో పాటు ఉద్యోగి బత్తుల సుహాసిని ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మహేశ్ తమతో చెప్పాడని.. ఆ మేరకు ఆమెకు సంబంధించిన వివరాలు కోరాడని చెబుతున్నాడు ఏజెన్సీ నిర్వాహకుడు.
ప్రిన్సిపాల్ సమాచారం.. తల్లిదండ్రులు అప్రమత్తం
గత నెల 31వ తేదీన ఆ అమ్మాయి చదువుతున్న కాలేజీకి వెళ్లి వివరాలు సేకరించారు కిరణ్ కుమార్, సుహాసిని. సదరు బాలిక నేపథ్యమేంటి, వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, సోషల్ మీడియా ఖాతాలున్నాయా.. ఇలాంటి ప్రశ్నలను ఆమె తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో విషయం కాస్తా ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ మేరకు వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
అది చట్టవిరుద్ధమే..!
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు సైబరాబాద్ పోలీసులు. మహిళల వ్యక్తిగత వివరాలు సేకరించడానికి ఎలాంటి అనుమతులు ఉండవన్నారు సీపీ మహేశ్ భగవత్. ఒకవేళ రహస్యంగా సేకరిస్తే అది చట్టవిరుద్ధమేనని స్పషం చేశారు. మొదటిసారిగా ఇలాంటి కేసు నమోదు కావడం చర్చానీయాంశమైంది. మైనర్ బాలిక వ్యక్తిగత సమాచారం సేకరించే క్రమంలో.. డీఆర్డీవో ఉద్యోగి మహేశ్ కుమార్ నాన్బెయిల్బుల్ సెక్షన్ల కింద జైలు పాలయ్యాడు. అతడికి సహకరించిన ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకుడు, అందులో పనిచేస్తున్న ఉద్యోగి కూడా కటకటాల పాలయ్యారు.
వీళ్లు చాలా ముదురు..!
ఈ కేసుతో ప్రమేయమున్న సదరు స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీపై పోలీసులు ఆరా తీశారు. కార్యాలయ నిర్వహణకు సంబంధించి సరైన పత్రాలు లేవని గుర్తించారు. కేవలం లేబర్ లైసెన్స్ తీసుకుని డిటెక్టివ్ ఏజెన్సీ కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంస్థ ఇప్పటివరకు దాదాపు 60-70 మంది మహిళల సమాచారం సేకరించినట్లు సమాచారం. వాటిపై కూడా దృష్టి పెడతామని పోలీసులు తెలిపారు. మహిళల వివరాలు సేకరించడం చట్టవిరుద్దం కావడంతో.. మహేశ్ కుమార్, కిరణ్ కుమార్, సుహాసినిపై పోక్సో చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.