హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం: రూ. 3 కోట్ల విలువ, ఆస్ట్రేలియాకు పార్శిల్!
హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సికింద్రాబాద్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో సికింద్రాబాద్లోని ఓ పార్శిల్ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీకి పంపించేందుకు ఆహార పదార్థాలతోపాటు సిద్ధంగా ఉంచిన 8 కిలోల ఓ పార్శిల్ను అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి తెరిచి చూడగా 7 కిలోల ఆహార పదార్థాలతోపాటు మరో కిలో మెథాంపేటమైన్ అనే డ్రగ్ ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఈ మత్తు పదార్థాల విలువ సుమారు రూ. 3 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పార్శిల్ చేసిన వారి వివరాలను పరిశీలించగా అవన్నీ నకిలీవిగా తేలినట్లు డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. కొరియర్ కార్యాలయం నుంచి పార్శిల్ను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుల కోసం కార్యాలయం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్స్: 10 కోట్ల టోకరా
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ప్రశాంత్నగర్లోని కేకేఆర్ చిట్స్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. 300 మంది ఖాతాదారుల నుంచి దాదాపు రూ. 10 కోట్లు వసూలు చేసిన చిట్ ఫండ్స్ నిర్వాహకులు పరారయ్యారు.
చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్లు కిరణ్ కుమార్, షణ్ముఖి, వెంకటరమణరావు ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడం, ఖాతాదారులకు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఆదివారం ఉదయం చిట్ ఫండ్స్ ఖాతాదారులంతా చిట్ ఫండ్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.