పెరుగుతున్న మందుబాబులు.. మార్చి లెక్కలు చూస్తే పరేషానే..!
హైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సైబరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తాగి రోడ్డెక్కేవారు మాత్రం పద్దతి మార్చుకోవడం లేదు. ఫుల్లుగా తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. మందుబాబుల కట్టడికి వీపరీతమైన డ్రంక్ అండ్ డ్రైవ్లు చేపడుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు.
కుండపోత వర్షంలో తడుస్తూనే డ్యూటీ.. సూపర్ హీరోగా ట్రాఫిక్ పోలీస్..! (వీడియోలు)
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వాహనాలు సీజ్ చేస్తూ, జైలుకు పంపుతున్నా.. మందుబాబుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మార్చి నెలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నగరమంతటా కలిపి 1,956 కేసులు నమోదు కావడం గమనార్హం. వివిధ కోర్టుల్లో వారిని హాజరు పరచగా.. అందులో దాదాపు 500 మందికి జైలు శిక్ష ఖరారైంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి మార్చి లెక్కలు చూసినట్లయితే.. 1,164 టూ వీలర్స్, 110 ఆటోలు, 662 కార్లు, 20 భారీ వాహనాలు పట్టుబడ్డాయి. నమోదైన 1,956 కేసుల్లో వయసుల వారీగా చూసినట్లయితే.. ఒకరు మైనర్, 18 నుంచి 30 ఏళ్ల వయసున్నవారు 885 మంది, 31 నుంచి 40 ఏళ్ల ఏజ్ ఉన్నవారు 729 మంది, 41 నుంచి 50 ఏళ్ల వయసున్నవారు 254 మంది, 51 ఏళ్లు పైబడ్డవారు 87 మంది ఉన్నారు. అందులో 460 మందికి 1-5 రోజులు.. 40 మందికి 6-25 రోజుల వరకు జైలు శిక్ష పడింది.