ఫ్లై ఓవర్ పనుల్లో అపశృతి.. క్రేన్ బోల్తా పడి ఆపరేటర్ మృతి..
హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మిస్తున్న షేక్పేట్ ఓయూ కాలనీ ఫ్లై ఓవర్ పనుల్లో అపశృతి దొర్లింది. నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న భారీ క్రేన్ ఒక్కసారిగా రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. క్రేన్ ఆపరేటర్ భయంతో ఒక్కసారిగా కిందకు దూకడం అతని ప్రాణాల మీదకు తెచ్చింది. అతనిపై క్రేన్ ఒరిగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
క్రేన్ ప్రమాదం నేపథ్యంలో షేక్పేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలిసి ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పరిస్థితిని సమీక్షించారు. క్రేన్ ఆపరేటర్ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా పరిహారాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
భారీ క్రేన్ను వెంటనే తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. క్రేన్ పడిపోయిన ప్రాంతంలో వాటర్ పైప్లైన్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో వాటికి ఎలాంటి డ్యామేజీ జరగకుండా చూడాలని కమిషనర్ సూచించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.