హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం .. స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తున్న ముఠా
హైదరాబాద్ మహానగరంలో స్టూడెంట్స్ టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా చెలరేగి పోతూనే ఉంది. డ్రగ్స్ మాఫియా పై ఉక్కు పాదం మోపడానికి అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, నార్కోటిక్స్ అధికారులు ఎంతగా ప్రయత్నం చేసినా చాప కింద నీరులా డ్రగ్స్ దందా విస్తరిస్తూనే ఉంది. పోలీసుల కళ్లు గప్పి స్టూడెంట్స్ కు డ్రగ్స్ సరఫరా జరుగుతూనే ఉంది.
ఘనా దేశస్తురాలి నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
తాజాగా ఓ విదేశీ మహిళ కొకైన్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడింది .దీంతో హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. స్టూడెంట్స్ని టార్గెట్గా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న ఓ విదేశీ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను ఘనా దేశస్తురాలిగా గుర్తించారు. ఆమె నుంచి 50 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ డ్రగ్స్ దందా వెనుక ఎంతమంది ఉన్నారు? ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు? నగరంలో ఏయే ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఫిబ్రవరి 21వ తేదీన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు.
తెరమరుగైన డ్రగ్స్ అంతర్జాతీయ రాకెట్ కేసు... ప్రముఖుల పేర్లు ఉండటమే కారణం
గతంలో అంతర్జాతీయంగా హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేసే ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ డ్రగ్స్ మాఫియాతో సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకుల పిల్లలకు సంబంధం ఉందని గుర్తించిన అధికారులుఈ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు చేశారు. రాజధాని కేంద్రంగా మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాపై ఉక్కు పాదం మోపే క్రమంలో కెల్విన్ ను అరెస్ట్ చేసి కీలక సమాచారం సేకరించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఈ రాకెట్ లో ఉన్న వారికి చెమటలు పట్టించారు. బెదిరింపులు సైతం ఎదుర్కొన్నారు.ఆ తరువాత ఈ కేసు తెరమరుగైంది. ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్న నేపధ్యంలోనే ఈ కేసు అక్కడికే ఆగిపోయిందని తెలుస్తుంది.
మరోమారు డ్రగ్స్ మాఫియా కలకలం .. సంపన్నుల పిల్లలు, స్టూడెంట్స్ టార్గెట్
ప్రస్తుతం మరో మారు డ్రగ్స్ ముఠా తమ కార్యకలాపాలను సాగిస్తుండడంతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.పోలీసుల కళ్లు గప్పి మాదకద్రవ్యాలను నగరంలోకి తరలిస్తున్నారు. వాటిని కాలేజీ స్టూడెంట్స్కు సప్లయ్ చేస్తున్నారు. సంపన్నుల పిల్లలను కూడా టార్గెట్ చేస్తున్నారు. వారిని మాదకద్రవ్యాలకు బానిసలు చేసి బిజినెస్ చేసుకుంటున్నారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలు డ్రగ్స్ బానిసలుగా మారినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ దందాను మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. గతంలో పట్టుబడిన కెల్విన్ ఇచ్చిన సమాచారంతో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి డ్రగ్స్ మాఫియా పై ఉక్కు పాదం మోపితే, వారికి శిక్ష పడేలా చేస్తే కొంతయినా డ్రగ్స్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్టు ఉండేది. కానీ అలా జరగక పోవడం ఇప్పుడు మళ్లీ డ్రగ్స్ దందా తెరపైకి రావడం తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది.