గులాబీ బాస్ కు షాక్ ఇచ్చిన డీఎస్ .. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు హాజరు
Recommended Video
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ డి. శ్రీనివాస్ బుధవారం నాడు హాజరయ్యారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డీఎస్ ఈ రోజు గులాబీ పార్టీ సమావేశానికి హాజరై షాక్ ఇచ్చారు. .అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని డిఎస్పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఆయనపై కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటారని భావించినప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఎంపీ హోదాలో అయన టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యారు.
పరిటాల కుటుంబానికి బంపర్ ఆఫర్ ఇస్తూ చంద్రబాబు ప్రకటన .. రీజన్ ఇదే
ఎన్ని ఫిర్యాదులు చేసినా టీఆర్ఎస్ ను వీడని డీఎస్
తెలంగాణ రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్ ది ఓ కీలకమైన పాత్ర. ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడ కూడా మంచి ప్రాధాన్యత తో కూడిన పదవులే లభించాయి. అయితే ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన మీద సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు .ఈ ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు ఆయన కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఆయన పార్టీ మారలేదు. టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు.
టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన డీఎస్
తాజాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో డీఎస్ తనయుడు అరవింద్ , సిట్టింగ్ ఎంపీ కవిత ను ఓడించడంలో ఆయనదే కీలకపాత్ర అని కూడా ప్రచారం జరిగింది . ఇక్కడ వేరెవరో వ్యక్తి గెలిస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ .. బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి కవితను ఓడించడం కేసీఆర్,కేటీఆర్ లకు మింగుడుపడడం లేదు. ఇక ఈ వ్యవహారంలో అయినా డీఎస్ పై చర్యలుంటాయని పార్టీ వర్గాలు ఎదురుచూశాయి. అయితే రోజులు గడుస్తున్నా... ఈ విషయంలో కేసీఆర్ మాత్రం చూసీచూడనట్టుగానే వ్యవహరించారు. ఫలితంగా ఆయన టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందరికీ షాక్ ఇచ్చారు.
కేసీఆర్ కు కొరకరాని కొయ్యలా మారిన డీఎస్
అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డీఎస్పై పార్టీ పరమైన చర్యలు తప్పితే ... రాజ్యసభలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఫిర్యాదు చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ అయిన అరవింద్ తండ్రి డీఎస్పై చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో డీఎస్ విషయంలో ఏమీ అర్ధం కాని సంకట స్థితిలో ఉంది టీఆర్ఎస్ అధిష్టానం . ఇక ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డిఎస్ హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో డీఎస్ కేసీఆర్ కు కొరకరాని కొయ్యలా మారాడు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.