నకిలీ పోలీస్.. ప్రేమికులే టార్గెట్.. లక్షలు దోచాడుగా..!
హైదరాబాద్ : ప్రేమికులే టార్గెట్గా ఓ నకిలీ పోలీస్ రెచ్చిపోయాడు. ప్రేమపక్షులను బెదిరిస్తూ లక్షల్లో గుంజాడు. తన కంటపడ్డ లవర్స్ను పోలీస్నంటూ భయపెడుతూ నగదు, నగలు కాజేశాడు. లవ్ మ్యాటర్ బయటపడితే బాగుండదనే ఉద్దేశంతో చాలామంది బాధితులు మిన్నకుండి పోయారు. కానీ చివరకు కొందరు ధైర్యం చేసి నిజమైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే నకిలీగాడి లీలలు వెలుగుచూశాయి.
ఈ నకిలీ పోలీస్ అరాచకాలు ఇదేమీ కొత్త కాదు. గతంలో ఓసారి పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయితే బెయిల్పై బయటకొచ్చి వ్యాపారంలోకి దిగాడు. అందులో నష్టాలు రావడంతో మళ్లీ పాత రూట్నే ఎంచుకున్నాడు. ప్రేమికులను బెదిరిస్తూ అడ్డంగా దోచుకుంటున్న సదరు నకిలీ పోలీస్ మరోసారి కటకటాలపాలయ్యాడు.
నడిరోడ్డుపై కత్తుల వీరంగం.. హైదరాబాద్లో దారుణ హత్య.. పేగులు చేతబట్టుకుని బాధితుడి పరుగులు
నకిలీ పోలీస్.. ప్రేమికులే టార్గెట్
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతంలోని మల్లాపురం గ్రామానికి చెందిన 38 సంవత్సరాల చింతల చందు డ్రైవర్గా పనిచేసేవాడు. చంద్రశేఖర్, చంద్రయ్య తదితర పేర్లతో చలామణి అయ్యేవాడు. 2002వ సంవత్సరంలో మేడిపల్లిలో ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహించాడు. అయితే అందులో నష్టాలు రావడంతో మోసాలు చేయాలని ప్లాన్ వేశాడు.
ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ప్రేమికులను టార్గెట్ చేసి డబ్బులు దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో నిర్మానుష్య ప్రాంతాల్లో లవర్స్ కనపడితే చాలు ఇతగాడి పంట పండేది. పోలీసునంటూ, స్టేషన్కు రావాలంటూ వారిని బెదిరించే ప్రయత్నం చేసేవాడు. దాంతో వారు భయపడి బతిమిలాడుకునేవారు. అదే అతడికి కాసులపంట కురిపించింది. దాంతో వారి దగ్గరున్న నగలు, నగదు దోచుకునేవాడు.
2015లో జైలుశిక్ష.. మళ్లీ అదే బాట
2015వ సంవత్సరంలో అబ్దుల్లాపూర్మెట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ ప్రేమ జంట నిర్మానుష్య ప్రాంతంలో ఉండటం గమనించాడు. వారి దగ్గరకు వెళ్లి పోలీసునంటూ భయపెట్టి 2 వేల రూపాయల నగదు దోచుకున్నాడు. అయితే బాధితులకు అనుమానం వచ్చి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ పోలీస్ బాగోతం బయటపడింది. దాంతో చందును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కొద్దికాలం జైలుశిక్ష అనుభవించి బెయిల్పై బయటకొచ్చాడు. ఆ క్రమంలో సొంత గ్రామానికి వెళ్లి చేపల వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో కూడా నష్టాలు రావడంతో మళ్లీ హైదరాబాద్కు చేరుకున్నాడు. ఏం పని చేయాలో తోచక మళ్లీ పాత బాటలోనే పయనించాడు. ప్రేమికులే టార్గెట్గా ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలతో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపించే ప్రేమజంటలను ఫాలో అవుతూ అందినకాడికి దోచుకున్నాడు.
భయపడి కొందరు.. పరువు పోతుందని మరికొందరు..!
పోలీసునంటూ బెదిరిస్తూ ప్రేమ జంటల నుంచి గోల్డ్ చైన్లు, చెవి రింగులు, నగదు దోచుకెళ్లేవాడు. అయితే చాలామంది బాధితులు తమ లవ్ మ్యాటర్ బయటకు వస్తే బాగుండదని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేవారు కాదు. కానీ ఓ నాలుగు జంటలు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో నిందితుడి లీలలు మరోసారి బయటపడ్డాయ.
తాను పోలీసునని బెదిరించి వారి నుంచి నగదుతోపాటు యువతుల బంగారు గొలుసులు, చెవి రింగులు దోచుకున్నాడు. ఇలా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 27, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 కేసుల్లో ఇతను నిందితుడు. అయితే చాలామంది పరువు పోతుందని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కేవలం నలుగురు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీస్ శాఖలో కొత్త కొలువులు.. 15 వేల నియామకాల భర్తీకి కసరత్తు
తన చెల్లిని ఎవడో మోసం చేశాడట.. అందుకే ప్రేమికులంటే కోపమట..!
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు నిందితుడి ఆట కట్టించారు. అబ్దుల్లాపూర్మెట్ ఓఆర్ఆర్ దగ్గర తచ్చాడుతున్న చందును బుధవారం అదుపులోకి తీసుకొని విచారించారు. దాంతో తాను చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. అతడు చెప్పిన వివరాలతో 30 కేసుల్లో నిందితుడిగా తేల్చారు. 6 లక్షల రూపాయల విలువచేసే నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పోలీస్ బారిన పడి మోసపోయినవారు తమను సంప్రదిస్తే వివరాలు సరిచూసుకుని సొత్తు అప్పగిస్తామని తెలిపారు సీపీ.
అదంతా ఒక ఎత్తైతే సదరు నిందితుడు చెప్పిన వెర్షన్ విస్మయం కలిగిస్తోంది. తన సోదరిని ఓ వ్యక్తి ప్రేమపేరుతో మోసం చేశాడని.. అందుకే తనకు ప్రేమికులంటే కోపమని పోలీసులకు తెలిపాడు. అందుకే వారిని లక్ష్యంగా చేసుకుంటూ ఈ దోపిడీలకు స్కెచ్ వేసినట్లు వెల్లడించాడు. అయితే ఇది కట్టుకథనా, నిజమా అన్నది మాత్రం సస్పెన్స్గా మిగిలిపోయింది. పోలీసుల పూర్తి విచారణలో ఇంకెన్నీ నిజాలు బయటపడతాయో చూడాలి.