స్మార్ట్గా ప్లానేసిండ్రు.. అడ్డంగా దొరికిపోయిండ్రు.. నకిలీ పోలీసుల కథ
మన్సూరాబాద్ : నకిలీ ఐడీ కార్డులతో రెచ్చిపోయారు. పోలీస్ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారు. సాయుధులై సంచరిస్తూ అడ్డగోలు సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. చివరకు అడ్డంగా బుక్కయ్యారు డమ్మీలు. దొరికితే దొంగ, లేదంటే దొర అనే చందంగా ఇన్నాళ్లు దర్జాగా తిరిగారు. సీన్ రివర్స్ కావడంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.
ఇదివరకు హోంగార్డులుగా విధులు నిర్వహించిన ఇద్దరు వ్యక్తులకు.. ప్రస్తుతం హోంగార్డుగా కొలువు చేస్తున్న మరో వ్యక్తి జత కలిశాడు. ముచ్చటగా ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఎస్ఐ, కానిస్టేబుల్ నకిలీ ఐడీ కార్డులు తయారుచేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. వీరి బిల్డప్ అనుమానం రాకుండా ఉండటంతో ఇన్నాళ్లు సజావుగానే సాగింది వీరి డమ్మీ కథ. తప్పు చేసినోళ్లకు ఎప్పుడో ఓసారి శిక్ష పడాల్సిందేగా.. వీరి విషయంలోనూ అదే జరిగింది. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎస్ఐ, కానిస్టేబుల్స్ వేషం.. యదేఛ్ఛగా దందాలు
జిల్లెలగూడ న్యూ గాయత్రినగర్ కు చెందిన కసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి ఆబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య ప్రతిమరెడ్డి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు చిట్టీలు నడుపుతున్నాడు. గతంలో హోంగార్డుగా పనిచేసిన తాలూరి అశోక్ ప్రస్తుతం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మరో మాజీ హోంగార్డు దేవిరెడ్డి అక్కిరెడ్డి అంబర్ పేటలో మీసేవా కేంద్రం నడుపుతున్నాడు. వీరికి పాత పరిచయం ఉండటంతో ముగ్గురూ కలిసి వ్యాపారం చేద్దామని డిసైడయ్యారు.
ఆ క్రమంలో నకిలీ ఎస్సై అవతారమెత్తాడు కసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి. తాలూరి అశోక్ తో పాటు దేవిరెడ్డి అక్కిరెడ్డిని కానిస్టేబుల్స్ గా మార్చేశాడు. నకిలీ ఐడీ కార్డులు ముద్రించి ఒరిజినల్ పోలీస్ బిల్డప్ ఇచ్చారు. వెంకటేశ్వర్ రెడ్డికి చెందిన ఫార్చునర్ కారును వీరి అక్రమాలకు వాడుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీరు సెటిల్మెంట్లకు పాల్పడ్డారు.
బిల్డప్.. ఫార్చూనర్ కారు, చేతిలో గన్
నకిలీ ఐడీ కార్డులతో నిజమైన పోలీసులుగా చలామణీ అయిన ఈ ముగ్గురి బిల్డప్పులకు కొదువ లేదు. దేవాలయాల్లో వీఐపీ దర్శనాలతో పాటు టోల్ గేట్ల దగ్గర ఛార్జీలు చెల్లించకుండా దర్జాగా తిరిగారు. ఫార్చునర్ కారు (టీఎస్07 జీడీ8686) లో ప్రయాణిస్తూ అవసరమైనప్పుడు పోలీస్ సైరన్ మోగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు. చిట్ఫండ్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ లోనూ ఆరితేరారు. సెటిల్మెంట్ల సమయంలో ఎయిర్ గన్ చూపిస్తూ అవతలివాళ్లను భయభ్రాంతులకు గురిచేసేవారు.
గుట్టురట్టు ఇలా..!
ఇటీవల ఈ ముగ్గురు కలిసి యాదగిరిగుట్ట సమీపంలో కొంత భూమిని కొనుగోలు చేశారు. ఆ మేరకు భూయజమానికి కొంత డబ్బు ముట్టజెప్పారు. అయితే వీరికి ల్యాండ్ అమ్మినతను ధరలు పెరిగాయని మరికొంత ఎక్కువ చెల్లించాలంటూ రిజిస్ట్రేషన్ వాయిదా వేస్తున్నాడు. ఆ క్రమంలో అతడిని కలిసేందుకు ఈ ముగ్గురు ఫార్చునర్ కారులో బయలుదేరారు. ఎల్బీనగర్, సాగర్ రింగురోడ్డు సమీపంలోని అలేఖ్య టవర్స్ దగ్గర నిజమైన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరి గుట్టురట్టైంది. సైరన్ మోగిస్తూ ఫార్చునర్ కారు రావడంతో వారు అలర్టయ్యారు. అనుమానం వచ్చి ఆరా తీయగా నకిలీ ఐడీ కార్డుల విషయం బయటపడింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఫార్చునర్ కారుతో పాటు ఎయిర్ గన్, 36వేల రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.