లుక్స్ గ్రేట్.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ మరింత శోభ
హైదరాబాద్ అంటే ఇప్పటివరకు చార్మినార్, సైబర్ టవర్స్ గురించే ఎక్కువగా విన్నాం.. చెప్పాం.. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. హైదరాబాద్ అంటే దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జీ అని కూడా చెప్పాల్సి వస్తోంది. ఇదివరకు చార్మినార్, సైబర్ టవర్స్ చూసేందుకు టూరిస్ట్ ఆసక్తి కనబరిచేవారు. వీటిసరసన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి చేరింది. దీనిని చూసేందుకు ప్రతి రోజు వేలసంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. వీక్ ఎండ్స్ లో ఈ సంఖ్య ఎక్కువే ఉంటుంది.
ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు.. ఇతర దేశాలకు చెందిన అధికారులు కూడా దుర్గం చెరువు బ్రిడ్జ్ ని ఓ లుక్కేసి పోతున్నారు. బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళ్లారు. తన కారు వెళ్తున్న సమయంలో ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాల్లో సాయంత్రం వేళ బ్రిడ్జి అందాలు సుందరంగా కనిపించాయి. కొద్దీ కొద్దిగా చీకటి పడుతున్న సమయంలో ఎదురుగా ఉన్న భవనాలు దుర్గం చెరువు బ్రిడ్జికి కొత్త శోభను తెచ్చిపెడుతున్నాయి.
భాగ్యనగర ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా.. హైదరాబాద్లో మరో అత్యాధునిక నిర్మాణం చేరింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందాలు నగానికే ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి. ఆసియాలోనే పెద్దదైన అద్భుతమైన కేబుల్ వంతెనను తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ హైదరాబాద్ ప్రజలకు అంకితం చేసిన సంగతి తెలిసిందే.