దుర్గం చెరువు కు కొత్త అందాలు: హౌరా బ్రిడ్జిని తలపించేలా : నెటిజెన్ల ప్రశంసలు..!
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు రూపు రేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. విదేశాలను తలపించే రీతిలో ఇక్కడ సాగుతున్న కొత్త ప్రణాళికల గురించి మంత్రి కేటీఆర్ ఫొటోలతో సహా ట్వీట్ చేసారు. దీనికి నెటిజెన్ల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. దుర్గం చెరువు తీగల వంతెన లింగ్ ఫొటోలను కేటీఆర్ షేర్ చేసారు. పనులు తుది దశకు చేరుకోవటంతో..ఆ పరిసర ప్రాంతాలు కొత్త రూపుతో కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆలోచన బాగుందంటూ నెటిజెన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ డోస్డ్ కేబుల్ బ్రిడ్జి పనుల్లో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడ 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తున్న సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్ల అమరికకు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కో సెగ్మెంట్ను మాత్రమే అమర్చగా... శనివారం ఏక కాలంలో రెండు సెగ్మెంట్లను ఒకేసారి పైకి తీసుకెళ్లి విజయవంతంగా అమర్చారు.
The cable suspension bridge at Durgam Cheruvu, besides providing relief to lakhs of commuters is also going to be a wonderful addition to the city landscape 😊#HappeningHyderabad pic.twitter.com/v7C9rPmGPT
— KTR (@KTRTRS) November 17, 2019
దీంతో.. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్ ఇనార్బిట్మాల్ వరకు దాదాపు కి.మీ. పొడువున నిర్మించే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్సిటీ, మాదాపూర్ రూట్లో వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అలాగే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకోనుంది. హౌరా- కోల్కత్తాల నడుమ నున్న హౌరా బ్రిడ్జిని( రవీంద్ర సేతు) తలపించేలా ఈ వేలాడే వంతెనను నిర్మిస్తున్నారు.
ఈ బ్రిడ్జ్ మొత్తంగా ఆరు లేన్లతో తగిన ఫుట్పాత్లతో నిర్మిస్తున్న ఈబ్రిడ్జిపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. దీనికయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ చెరిసగం భరించనున్నాయి. ముంబై, గోవా, కోల్కత్తా, జమ్మూకాశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఇలాంటి బ్రిడ్జిలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అందుబాటులో లేవు.
అదే సమయంలో ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. నగరంలోని ఇతర ప్రాంతాలనుంచి హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు వెళ్లే వారికి సదుపాయంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటుగా.. జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 36, మాదాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఇక, జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలి వెళ్లేవారికి దాదాపు 2 కి.మీ.ల మేర దూరం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణంలో వినియోగిస్తున్న సాంకేతికత .. ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే పరిజ్ఞానంతో నిర్మాణ పనులు చేపడుతున్నారు. అప్రోచ్లతో సహ బ్రిడ్జి పొడవు: 1048 మీ. కాగా.. కేబుల్ స్టే బ్రిడ్జి (వేలాడే వంతెన): 366 మీ గా ఉంది. ఇక, అప్రోచ్ వయడక్ట్, ర్యాంప్: 682 మీ. గా ఉండనుంది. నిర్మాణ పనులు మరి కొన్ని రోజుల్లో పూర్తవుతాయని..ఆ తరువాత లక్ట్రిఫికేషన్ పనులు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. రోడ్ నెంబర్-45 నుంచి ఐటీ కారిడార్కు రాకపోకలు సులువవుతాయి. అదే విధంగా నగరంలో కోల్ కత్తా తరహాలో రవీంద్ర సేతు మోడల్ ఇక్కడ దర్శనమివ్వనుంది.