విజయదశమి వేడుకలు.. జమ్మి ఆకు బంగారం.. పండుగ సంబరాలు
Recommended Video
హైదరాబాద్ : దసరా వచ్చిందయ్యో, సరదా తెచ్చిందయ్యో అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు పండుగ సంబురాల్లో మునిగి పోయారు. జయహో దుర్గా భవాని అంటూ అమ్మవారి నామస్మరణతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. విజయదశమి పండుగ నేపథ్యంలో ఊరూవాడా సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు.. చల్లని చూపుల తల్లి కరుణ కోసం పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక భవాని దీక్షాపరులు దుర్గ నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
దసరా ఉత్సవాలు.. మహిషాసురమర్ధిని: జననమరణాలు సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలు
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ శోభ
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ శోభ వెల్లివిరుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారు జాము నుంచే పండుగ సందడి మొదలైంది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అంతేకాదు ఊరూవాడ వెలిసిన దుర్గా దేవి మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో మండపాల దగ్గర కోలాహలం కనిపిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా దసరా పండుగ సంబరాలను ఘనంగా చేసుకుంటున్నారు. ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం సొంతూళ్లకు చేరుకుని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు.
ఆలయాలు కిటకిట.. అమ్మవారి దర్శనానికి క్యూ
దసరా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చరమాంకానికి చేరుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి పోటెత్తారు భక్తులు. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నవ రాత్రులు రోజుకో రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని కొలుస్తూ భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. అటు శ్రీశైలం సన్నిధిలో భ్రమరాంబ అమ్మవారిని కొలిచి మొక్కుతూ దసరా పండుగను సంబురంగా చేసుకుంటున్నారు.
జమ్మి చెట్టు ప్రత్యేకత.. తెలంగాణలో అలయ్ బలయ్
ఇక దసరా రోజు జమ్మి చెట్టును పూజించడం ఆచారంగా వస్తోంది. విజయదశమి రోజు సాయంత్రం జమ్మి చెట్టు దగ్గర అపరాజితా దేవిని పూజించి "శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం" అనే శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షణ చేస్తారు. తెలంగాణలో ఓ ఎత్తైన గద్దెపై జమ్మి చెట్టును ఉంచి.. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత ఊరి ప్రజలు ఆ జమ్మి చెట్టుకున్న ఆకులను తీసుకునేందుకు పోటీ పడుతుంటారు. అక్కడ కలిసిన బంధువులతో అలయ్ బలయ్ (ఆలింగనం) తీసుకుంటూ ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
అక్కడి నుంచి జమ్మి ఆకులను తమ వెంట తీసుకెళ్లి ఇంటి దగ్గర పెద్దలకు, తెలిసిన వారికి చేతిలో పెట్టి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడి వాడుక భాషలో జమ్మి ఆకును బంగారంగా పిలుస్తారు. కులాలకు అతీతంగా కనిపించే ఈ సంప్రదాయం దసరా పండుగ విశిష్టతను మరింత ఇనుమడింపజేస్తోంది. ప్రజల జీవన ఐక్యతారాగాన్ని చాటి చెబుతుంది. అందుకే దసరా పండుగ మానవ సంబంధాల మనుగడకు ప్రతీకగా నిలుస్తోంది. హ్యాపీ దసరా ఎవ్రీ వన్.