అసెంబ్లీ ఆవరణలో గాల్లో వేలాడిన ప్రాణం .. సిబ్బంది గంటన్నర శ్రమ ... ఫైనల్గా ఏమైంది ....
హైదరాబాద్ : అసెంబ్లీ .. శాసనాలు చేసే సభ్యులు కొలువుదీరే సమావేశ మందిరం. ఆ పరిసరాలను డేగా కళ్లతో పర్యవేక్షిస్తారు. సమావేశాలు జరిగినా, జరగకపోయినా .. ప్రొటెక్షన్ కొనసాగుతుంది. అయితే గురువారం అసెంబ్లీ ప్రాంగణానికి అనుకొని అతిథి దర్శనమిచ్చిది. అక్కడే ఉన్న మామిడి చెట్టుపై చిక్కుకొని విలవిలలాడింది. వెంటనే అలర్టైన సిబ్బంది .. జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ శాఖ (డీఆర్ఎఫ్), ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపింది.
హుటహుటిన ..
అసెంబ్లీ సిబ్బంది సమాచారంతో ఆయా విభాగాలు హుటహుటిన పరుగెత్తాయి. ఏం జరిగిందోనని అక్కడున్న వారు ఒక్కసారి ఆగి చూశారు. అసెంబ్లీ రెండో గేటు వద్ద .. నిటారుగా చెట్టుపై చూడగా కనిపించింది ఆ దృశ్యం. చెట్టు కొమ్మపై చైనా మాంజాతో చిక్కుకొని ఉంది. అదేనండి గద్ద. ఆకాశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చే ఆ పక్షికి చైనా మాంజా రూపంలో వచ్చిన ఆపదతో అల్లాడింది. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు పది మంది కలిసి ఆ పక్షిని కాపాడేందుకు శ్రమించారు. చైనా మాంజాను తీసి .. పక్షిని కాపాడాలంటే మమూలు విషయం కాదు. అందుకే దాదాపు గంటన్నర సమయం పట్టింది.
కాపాడారు ...
సిబ్బంది శ్రమతో ఎట్టకేలకు ఆ గద్దకు ఉపశమనం లభించింది. దానిని కాపాడిన సిబ్బంది .. పరీక్షించి తిరిగి గాల్లోకి ఎగిరేశారు. దీంతో బతుకు జీవుడా అంటూ తుర్రుమని వెళ్లిపోయింది. అయితే అక్కడున్న వారు కూడా గద్దకు ఉపశమనం కలిగించడాన్ని స్వాగతించారు. మూగజీవిపై సిబ్బంది చూపిన ఔదార్యాన్ని ప్రశంసించారు. సాధారణంగా జనానికి ప్రమాదం వాటిల్లితేనే పట్టించుకోని సిబ్బంది ... నోరులేని పక్షిని కాపాడ ప్రయత్నం చేయడాన్ని కొనియాడారు.
ఏంటీ మాంజా .. ఏమా కథ ...
డ్రాగన్ చైనా ఉత్పత్తే మాంజా. దీంతో చాలా ప్రమాదమని నిషేధించారు కూడా. కానీ కొన్నిచోట్ల వాడుతూనే ఉన్నారు. వాస్తవానికి పతంగి ఎగరేయడానికి మాత్రమే మాంజా వాడతారు. కానీ కొన్నిచోట్ల అలా తెగిన మాంజా జనాలకే కాదు పక్షులకు ప్రాణసంకటం తెచ్చిపెడుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదహరణ అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటన. దీంతోనైనా పాలక ప్రభువులు మేల్కొని .. మాంజా వాడకంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లేకుంటే మరిన్ని పక్షులతోపాటు మనుషులకు కూడా ప్రమాదం పొంచి ఉంది.