2 వేల కోట్లకు పైగా ఆస్తులు టైలరింగ్, స్టిచింగ్తో సంపాదించారట, ఐటీ విచారణలో నయీమ్ భార్య..
ఒకటి కాదు రెండు కాదు.. వందలు కాదు రెండు వేల కోట్లను గ్యాంగ్స్టార్ నయీమ్ కూడబెట్టాడు. అతను పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కావడంతో ఆస్తులపై పోలీసులు ఫోకస్ చేశారు. ఈడీతోపాట ఐటీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. కుటుంబసభ్యులు, బినామీల పేర్లతో రూ.వందల కోట్లు విలువజేసే ఆస్తులను నయీం రిజిష్ట్రేషన్ చేసినట్టు తెలిసింది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం నయీం భార్య హసీనా బేగంను విచారించారు.
పొంతనలేని సమాధానాలు..
ఐటీ అధికారులకు నయీం భార్య పొంతనలేని సమాధానాలు చెప్పింది. తాను టైలరింగ్ చేస్తుంటానని.. స్టిచింగ్ చేస్తూ ఆస్తులు కూడబెట్టినట్టు తెలిపింది. ఆమె సమాధానంతో నోరెళ్లబెట్టడం అధికారుల వంతయిపోయింది. మీ వందల కోట్లు ఎలా సంపాదించారు...? ఆదాయానికి సంబంధించి పన్ను కట్టారా అని అధికారులు విచారణ వేగం పెంచడంతో హసీనా బేగం బిత్తరపోయినట్టు తెలుస్తోంది.
కదిలిన డొంక
ఆస్తులకు సంబంధించి వివరాలను పూసగుచ్చినట్టు అడగడంతో సమాధానం చెప్పినట్టు సమాచారం. హసీనా బేగం స్టేట్మెంట్ను ఐటీ అధికారులు రికార్డ్ చేశారు. ఆ రికార్డు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ఆస్తులను గుర్తించే అవకాశం ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తారు.
బినామీల పేరుతో
నయీం సంపాదించిన ఆస్తులను బినామీల పేరుతో ఉంచాడు. ఆ ఆస్తులు తనవి కాదని చెప్పి ఆదాయపు పన్ను శాఖ నుంచి తప్పించుకున్నారు. ఈ మేరకు ఐటీ అధికారులు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించారు. బినామీలే గాక కుటుంబసభ్యుల పేరుతో కూడా నయీం ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తోంది. వాటికి సంబంధించిన వివరాలను బుధవారం ఐటీ అధికారులు ఆరాతీశారు.
కుటుంసభ్యుల పేరుతో కూడా
బెదిరింపులకు పాల్పడి రూ. వందల కోట్లను సంపాదించాడు గ్యాంగ్ స్టార్ నయీమ్. తన పేరుతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కుటుంబసభ్యుల పేరుతో కొంత, తనతో సన్నిహితంగా ఉండేవారితో కొంత ఆస్తులను రాశాడు. వాటికి సంబంధించి పన్ను చెల్లించకుండా తప్పించుకున్నాడు. కానీ నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.