కూకట్పల్లిలో భూ ప్రకంపనలు: భయంతో పరుగులు తీసిన జనం
హైదరాబాద్: నగరంలో మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కూకట్పల్లిలో భూ ప్రకంపనలు సంభవించాయి. అస్బెస్టాస్ కాలనీలో బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధంతో భూమి కంపించింది.
రెండు మూడు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో భూమిలోపల నుంచి భారీ శబ్ధాలు వచ్చాయని చెప్పారు. ఒక్కసారిగా భూమి కదలడంతో ప్రజలంతా భయాందోళనలకు గురై ఇళ్ల బయటికి పరుగులు తీశారు. ఇటీవల బోరబండలో కూడా పలుమార్లు భూమి కంపించడంతో అక్కడి ప్రజలకు నిద్రలేకుండా పోయింది.
గత అక్టోబర్ నెలలో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మై హోం విహంగ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, టీఎన్జీవో 2 కాలనీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు.
భూమి లోపలి నుంచి శబ్దాలు కూడా వచ్చాయని భయాందోళనలు వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టార్ స్కేల్పై 0.5 నుంచి 0.8 మధ్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు. అయితే భూమిలోపల పొరల సర్దుబాటు వల్లే ఇలా ప్రకంపనలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.