రేవంత్ రెడ్డి అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ కొరడా
కొడంగల్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మంగళవారం వేకువజామున మూడు గంటలకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ విషయంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేసింది.
దీంతో రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో అతిగా వ్యవహరించిన పోలీసులపై కొరఢా ఝులిపించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రేవంత్ అరెస్టు వ్యవహారంలో వికారాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ అన్నపూర్ణపై బదలీ వేటు పడింది.
అన్నపూర్ణ స్థానంలో అవినాశ్ మహంతి
అన్నపూర్ణ స్థానంలో అవినాశ్ మహంతిని నియమించారు. అన్నపూర్ణను హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆమెకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించరాదని కూడా ఆదేశించింది. అవినాశ్ మహంతిని నూతన ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. నేడు బాధ్యలు స్వీకరిస్తారు.
వెంటనే బాధ్యతలు చేపట్టాలి
అవినాశ్ మహంతి 2005 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయనను వికారాబాద్ ఎస్పీగా నియమించారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలలోగా బాధ్యతలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
రేవంత్ రెడ్డి నివాసంలోకి చొరబడి అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు హైకోర్టులో సవాల్ చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కూడా ఫిర్యాదు చేశారు. దీని పైన నివేదిక తెప్పించుకున్న ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు చేపట్టింది. అన్నపూర్ణను బదలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయడంతో.. తెలంగాణ ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది.
రేవంత్ రెడ్డి అరెస్ట్, హైడ్రామా
మంగళవారం వేకువజామున మూడు గంటలకు రేవంత్ రెడ్డిని పోలీసులు ఆయన ఇంట్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొడంగల్లోని కోస్గీలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రేవంత్ను ఎక్కడ ఉంచారో చెప్పకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైడ్రామా చోటుచేసుకుంది. చివరికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో విడిచిపెట్టాలని ప్రధానాధికారి రజత్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఆ తర్వాత ఆయనను విడుదల చేశారు.