టీడీపీ నేత ముంచింది 6 వేల కోట్లా? ED ని తెలంగాణలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తారా?
హైదరాబాద్ : ఆరు వేల కోట్ల రూపాయల మోసం. వందకు పైగా డొల్ల కంపెనీలు. మూడు బ్యాంకులకు 364 కోట్లు ఎగవేత. తప్పుడు స్టేట్ మెంట్లతో రుణాలు. ఇవన్నీ టీడీపీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి చెందిన చిట్టాపద్దులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన దాడుల్లో వెలుగుచూసిన నిజాలు. హైదరాబాద్ కేంద్రంగా ఒకే చోట నుంచి 120కి పైగా కంపెనీల లావాదేవీలు నిర్వహిస్తుండటం గమనార్హం. అయితే ఈనెల 27న విచారణకు హాజరు కావాల్సిందిగా సుజనా చౌదరికి నోటీసులు జారీచేసినట్లు ప్రకటన విడుదల చేశారు ఈడీ అధికారులు.
టీడీపీకి షాక్: సుజనా చౌదరి నివాసం,ఆఫీసుల్లో ఈడీ సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుజనా గ్రూప్ లో 126 డొల్ల కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. సుజనాచౌదరి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈ కంపెనీలన్నీ కూడా ఆయన ఆదేశాలతోనే నడుస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి రుజువులు దొరికినట్లు చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్ లో సుజనా నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన అధికారులకు విస్తుపోయే సమాచారం దొరికినట్లు తెలుస్తోంది.
ఈడీ సోదాలు.. విస్తుపోయే నిజాలు
సుజనా చౌదరి నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా పంజాగుట్ట నాగార్జున హిల్స్ లో సుజనాచౌదరి నడుపుతున్న కార్యాలయంలో అనేక విషయాలు బయటపడినట్లు సమాచారం. డొల్ల కంపెనీలకు సంబంధించిన 126 రబ్బర్ స్టాంపులు, కొన్ని కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈడీ అధికారులు. వీటన్నంటికీ సుజనా చౌదరి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అలాగే డమ్మీ కంపెనీల పేరిట 6 ఖరీదైన కార్లు రిజిస్టరైనట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటిలో రేంజ్ రోవర్, ఫెరారీ, బెంజ్ తదితర కార్లు ఉన్నట్లు చెప్పారు.
బ్యాంకుల రుణాలు ఎంతెంత?
ఈడీ అధికారుల సోదాల్లో మూడు బ్యాంకులకు సుజనా గ్రూప్ 364 కోట్లు ఎగ్గొట్టినట్లు వెల్లడైంది. ఈ రుణాలన్నీ కూడ సుజనా చౌదరి వ్యక్తిగత పూచీకత్తుపైనే తీసుకున్నట్లు గుర్తించారు. కార్పొరేషన్ బ్యాంకు నుంచి 159 కోట్లు.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 133 కోట్లు.. ఆంధ్రా బ్యాంకు నుంచి 71 కోట్ల రుణం తీసుకుని మోసగించినట్లు తెలిపారు. సుజనా చౌదరికి చెందిన బీసీఈపీఎల్ సంస్థ తప్పుడు స్టేట్మెంట్లతో రుణాలు తీసుకున్నట్లు ఈ మూడు బ్యాంకుల అధికారులు ఫిర్యాదు చేయడంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
సుజనా గ్రూప్ కేసుల చిట్టా
మూడు బ్యాంకుల్లో 364 కోట్ల ఎగవేతకు సంబంధించిన ఫిర్యాదులతో సీబీఐ అధికారులు ఇదివరకే 3 కేసులు నమోదు చేశారు. అంతేగాకుండా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఫెమా లో మరికొన్ని కేసులు నమోదయినట్లు ఈడీ తెలిపింది. తాజాగా బ్యాంకుల ఫిర్యాదుతో సుజనా చౌదరి నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఈనెల 27న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు నోటీసులు జారీచేశారు. సుజనా గ్రూప్ కింద ఏర్పాటు చేసిన కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు, ఛైర్మన్ కు మధ్య జరిగిన ఈమెయిల్స్ ను గుర్తించారు.
సీబీఐ ని వద్దన్నారు.. ఇప్పుడు ఈడీ ని కూడా వద్దంటారేమో?
సీబీఐ దర్యాప్తు కోసం ఆ సంస్థకు రాష్ట్రాలు ఇచ్చే జనరల్ కన్సెంట్ ( సాధారణ సమ్మతి ) నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా టీడీపీకి చెందిన కీలక నేత సుజనా చౌదరి ఆస్తులపై ఈడీ దాడుల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీబీఐ జోక్యం వద్దన్నట్లుగానే ఇప్పుడు ఈడీని కూడా నిరాకరిస్తారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ ని వద్దనడానికి సాధారణ సమ్మతి ని అస్త్రంగా వాడుకున్న టీడీపీ నేతలు.. ఈడీ విషయంలో కూడా చట్టంలోని లొసుగులు వాడుకుంటారేమోననే టాక్ మొదలైంది.