మంచిరెడ్డి కిషన్ రెడ్డిని 10 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ: వివరాలు చెప్పిన ఎమ్మెల్యే
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సుదీర్ఘంగా ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్న ఆరోపణలపై కిషన్ రెడ్డిని బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులు ఆయనను విచారించారు.
బుధవారం ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చిన కిషన్ రెడ్డిపై దాదాపు 10 గంటలపాటు అనేక అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. బ్యాంకు ఖాతాలు, విదేశీ పర్యటనలు, ఆర్థిక లావాదేవీల వివరాలను మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ అధికారులకు వివరించినట్లు సమాచారం. రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.
ఓవైపు ఢిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ అధికారులు వరుసపెట్టి సోదాలు నిర్వహిస్తుండగా.. తాజాగా రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేని ఈడీ విచారించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అటు ఈడీ అధికారులు గానీ, ఇటు ఎమ్మెల్యే గానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
కేసు నమోదు కాలేదని, ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే ఆయనను మౌఖికంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇందులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా అవసరమైతే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.