టీడీపీకి షాక్: సుజనా చౌదరి నివాసం,ఆఫీసుల్లో ఈడీ సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అనుచరుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు కంపెనీలు, నివాసాలపై ఈడీ సోదాలు చేసిన ఘటన మరవకముందే ఈ సారి మరో ముఖ్య అనుచరుడు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీలు నివాసాలపై ఈడీ సోదాలు చేస్తోంది.
ఉదయం నుంచే జూబ్లీహిల్స్ లోని సుజనా చౌదరి నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్....అతని బంధువుల ఇళ్లపై కూడా సోదాలు చేస్తోంది. పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్లో ఉన్న సుజనా చౌదరి కంపెనీలపై కూడా ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. సోదాలు ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. సుజనా చౌదరి నివాసం, ఆయన కంపెనీలపై సోదాలు నిర్వహించడాన్ని టీడీపీ ఖండించింది. కేంద్రం తమపై కక్షగట్టిందని ఆరోపించింది.
చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకశక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో విజయవంతం అవుతున్నారు కాబట్టే మోడీ అమిత్షాలు తమపై తమ నేతలపై కక్షగట్టి ఈడీని ఉసిగొల్పుతున్నారని టీడీపీ వ్యాఖ్యానించింది. ఇలాంటి సోదాలకు బెదిరేది లేదంటూ కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే సీబీఐ ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని కేసులపై విచారణ జరపరాదంటూ ఏపీ ప్రభుత్వం ఓ జీవో జారి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగి ఉంటుందనే అనుమానాలు కొందరు రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video