ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ స్టార్ట్: ఏ తరగతులకు అంటే.. సీఎం కేసీఆర్ నిర్ణయం
రాష్ట్రంలో పాఠశాలల పున: ప్రారంభంపై క్లారిటీ వచ్చింది. ఏ తరగతులకు, ఎప్పటి నుంచి తెరవాలనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రగతి భవన్లో ఉన్నతాధికారుsలు సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. స్కూల్స్ తెరవడంపై నివేదిక అందజేశారు. అందులో అంశాలను సవివరంగా పొందుపరిచారు. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
20 రోజుల్లో స్కూల్స్ ఓపెన్..
ప్రగతి భవన్లో సోమవారం మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, అటవీశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల ప్రారంభంపై ఆ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని అధికారులు వెల్లడించారు. దీంతో విద్యాసంస్థల పునః ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో 10 నెలలుగా మూతబడిన పాఠశాలలు మరో 20 రోజుల్లో తిరిగి తెరుచుకోనున్నాయి.
ఓకేసారి ఖాళీల భర్తీ..
ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఒకేసారి వెంటనే భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించి అన్నిరకాల సమస్యలు సత్వరం పరిష్కరించాలని, ధరణి పోర్టల్లో అవసరమైన అన్నిరకాల మార్పులు చేర్పులు వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. కరోనా టీకా పంపిణీకి వెంటనే ఏర్పాట్లు పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు స్పష్టంచేశారు. చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేసి వెంటనే అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు నిర్మించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అర్హులకు వెంటనే పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆయాశాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.
పేరంట్స్ అనాసక్తి
పేరంట్స్ మాత్రం పిల్లలను స్కూల్/ కాలేజీలకు పంపడంపై నో అంటున్నారు. చదువు కన్నా ప్రాణం ముఖ్యం అని చెబుతున్నారు. ఇప్పటివరకు లాగానే ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని కోరుతున్నారు. మార్చి నుంచి లాక్ డౌన్ అమలు చేశారని.. మరో రెండు నెలలు గడిస్తే అకడమిక్ ఇయర్ అయిపోతుందని చెబుతున్నారు. ఇప్పటికే 70 శాతం వరకు పోర్షన్ అయపోయిందని చెప్పారు. మరో 30 శాతం పోర్షన్ కోసం స్కూల్ తెరవడం సరికాదు అని అభిప్రాయపడుతున్నారు.