శ్రావణమాస ప్రభావం..! నగరంలో తగ్గిన నాన్ వెజ్ వినియోగం..!!
హైదరాబాద్ : నగరంలో చికెన్, మటన్ షాపులు వెలవెల బోతున్నాయి. మాంసాహారం మీద శ్రామణమాసం ప్రభావం బాగా పడినట్టు తెలుస్తోంది. చికెన్, మటన్ ధరలు తగ్గినా కొనే వారు కరువయ్యారు. కొండెక్కిన కోడి ధర దిగొచ్చినా తినేందుకు నగరవాసులు పోటీపడడం లేదు. నెలరోజుల క్రితం సుమారు 280 రూపాయల వరకు కిలో చికెన్ ధర పలికింది. ఆ సమయంలోనే తినేందుకు పోటీపడ్డారు.
ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో ధర 150 రూపాయలకు దిగొచ్చినా చికెన్ షాపుల వద్ద జనాలే లేకపోవడం శోచనీయం అంటున్నారు వ్యాపారస్తులు. శ్రావణ మాసం కావడంతో మాంసాహారానికి అత్యధిక మంది నగరవాసులు దూరంగా ఉన్నారు. దీంతో చికెన్ వినియోగం తగ్గింది. సాధారణ రోజులతో పోల్చితే చికెన్ వినియోగం గణనీయంగా తగ్గింది.
బక్రీద్ పండుగ నేపథ్యంలో సోమవారం చికెన్ విక్రయాలు రెండు రోజులతో పోల్చితే కొంత మెరుగ్గా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ వినియోగం 5.50 లక్షల నుంచి 6లక్షల కిలోల వరకు ఉండగా, అందులో అత్యధికంగా 50 శాతం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటుంది. శ్రావణ మాసం నేపథ్యంలో ఈ నెల మొదటివారం నుంచే చికెన్ వినియోగం గణనీయంగా తగ్గింది. నగరంలో లక్ష కిలోలకు అటు, ఇటుగానే విక్రయాలు సాగుతున్నాయి.
ఇతర రోజులతో పోల్చితే శ్రావణంలో వినియోగం సగానికి సగం తగ్గింది. నగరంలోని పలు చికెన్ సెంటర్ సాధారణ రోజుల్లో సుమారు 40 నుంచి 60కిలోల వరకు చికెన్ విక్రయిస్తుండగా, శ్రావణ మాసం నేపథ్యంలో 30 కిలోలు కూడా విక్రయించడం కష్టంగా మారినట్టు తెలుస్తోంది. ఆదివారం ఎప్పడైనా కనీసం వందకిలోలకు తగ్గకుండా విక్రయించే షాపులు క్రితం ఆదివారం కనీసం 50కిలోలు కూడా అమ్మలేని పరిస్థితులు తలెత్తడం చికెన్ వర్తకుల్లో ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. స్కిన్ లెస్ కిలో 150 రూపాయలకు పడిపోయినా ఆశించిన స్థాయిలో అమ్మకాలుజరగలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు చికెన్ షాప్ యజమానులు.