కరోనా పరీక్ష చేసుకున్న తర్వాత ప్రచారం చేయాలి.. హైకోర్టులో పిటిషన్
కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేసేవారు కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. నెగిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాతే ప్రచారంలో పాల్గొనేలా చూడాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా పరీక్ష చేసుకున్న తర్వాతే ప్రచారం చేయాలని ఆయన పిటిషన్ వేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. టెస్టు చేసుకున్నాక అభ్యర్థులు ప్రచారం చేసేలా చూడాలని పిటిషన్లో కోరారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులతోపాటు ప్రచారం చేసే వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలన్నారు.
లేదంటే భారీగా కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి.. ఎన్నికలు నిర్వహించే విధంగా పోలీసులు, వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.
ఇటు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మధ్యలో కాంగ్రెస్, మజ్లీస్ కూడా తమ వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచార బరిలో దూసుకెళ్తున్నాయి.