ఇల్లిల్లు తిరుగుడేంది భాయ్..! స్టైల్ మారిన ప్రచారం.. ఓటర్లకు గాలం
హైదరాబాద్ : ప్రచారం స్టైల్ మారింది. కొత్తపుంతలు తొక్కుతోంది. ఇదివరకు గడప గడప తిరిగిన నేతలు.. ఇప్పుడు అరచేతి ఆయుధంతో ప్రచారానికి సిద్ధమయ్యారు. గతకాలపు ఎన్నికల ప్రచారాన్ని ఒకసారి ఊహించుకోండి. మైకుల హోరు, నేతల మాటల జోరు.. వెరసి చౌరస్తాలు ప్రచార వేదికలయ్యేవి. కానీ కాలం మారింది. క్యాంపెయిన్ ఈస్టైల్ కూడా మారింది. ఇంటింటి ప్రచారం కనుమరుగవుతున్న తరుణంలో నేతలు వాడుకుంటున్న ప్రచారాస్త్రాలు ఔరా అనిపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?
ప్రచారం కొత్త పుంతలు
ఎన్నికలప్పుడే కనబడతారా?.. గెలిచాక ముఖం చాటేస్తారా? ఇవి ఎలక్షన్లప్పుడు కామన్ గా వినిపించే మాటలు. ఇలాంటి మాటలతో నేతలు బేజారైన పరిస్థితులు ఉన్నాయి. ఓటర్లు ఇలా అడిగే తీరుతో ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. కానీ కాలానికి తగ్గట్టుగా మారుతున్న ప్రచార శైలి అభ్యర్థులకు వరంగా మారుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పడే యాతన తప్పుతోంది.
డప్పు సప్పుళ్లు లేవు.. వెనుకా ముందు మందీమార్బలం లేదు.. హాయిగా కూర్చున్న చోట నుంచే ప్రచారం పని కానిచ్చేస్తున్నారు కొందరు నేతలు. జనాల దగ్గరకు వెళ్లకుండానే సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు.
ఇంటింటి ప్రచారం వద్దు.. సోషల్ మీడియే ముద్దు
పట్టణాలు, నగరాల్లో ఇంటింటి ప్రచారం కష్టంతో కూడుకున్న పనే. ఎన్నికల వేళ నేతలు వస్తున్నారంటే తలుపులు మూసుకుంటున్న సందర్భాలు అనేకం. ఇక మైకుల హోరును తట్టుకోలేక డోర్లు వేసుకుని ఇంటి లోపలే ఉంటున్నారు. ఎంతో ఖర్చు పెట్టి మందీ మార్బలంతో ప్రచారానికి సిద్ధమైతే.. ప్రజల నుంచి స్పందన లేకపోవడం నేతలను కలవరపెడుతోంది. అందుకే సోషల్ మీడియాను నమ్ముకుని చెప్పాలనుకున్నదంతా అక్కడే చెప్పేస్తున్నారు.
అరచేతిలో ప్రపంచం కనిపిస్తున్న ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. ఎక్కడ ఏం జరిగినా జనాలకు క్షణాల్లో తెలిసిపోతోంది. అందుకే ఎన్నికల వేళ నేతలు కూడా అదే మాధ్యమాన్ని ప్రచారానికి వాడుకుంటున్నారు. 2014 ఎన్నికల నాటి నుంచి సామాజిక మాధ్యమం ట్రెండ్ నడుస్తోంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా చాలామంది అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారానే వీలైనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు. ఈసారి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా దాని హవానే.
ఇదే అల్కగుంది..!
ఇదివరకు ప్రజాప్రతినిధులుగా గెలిచినవారు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై ఆధారపడుతున్నారు. ఇక ఎన్నికలకు కొత్తవారైతే తమకు ఒక అవకాశం ఇవ్వాలని, తాము గెలిస్తే ఎలాంటి అభివృద్ది చేస్తామో వివరిస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు.
కేసీఆర్కు కూడా "రిటర్న్ గిప్ట్" వస్తోందా!.. టీఆర్ఎస్ మాజీ నేత కీలక వ్యాఖ్యలు
ఉపాధి.. నాలుగు కాసులు
సోషల్ మీడియా ప్రచారం కొంతమందికి ఉపాధి కల్పిస్తోంది. గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, స్క్రిప్ట్ రైటర్లు తదితర అంశాల్లో పట్టున్నవారికి ఆదాయ వనరుగా మారింది. జస్ట్ ఒక నెల పని కోసం 10 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
కొందరు అభ్యర్థులైతే ఏకంగా టీములను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఐటీ సెల్ గా పిలుచుకునే ఈ టీముల్లో ఎన్నికల వేళ దాదాపు 10 మంది వరకు పనిచేస్తున్నారు. రోజూవారీ ప్రమోషన్లు చేస్తూ తమ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తున్నారు. ఫేస్ బుక్ లో లైవ్ కార్యక్రమాలు, అభ్యర్థితో ముఖాముఖి, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం, నాలుగైదు గంటలకో పోస్ట్ పెట్టడం తదితర ప్రచారం హోరెత్తిస్తున్నారు. మొత్తానికి మారిన ట్రెండ్ ను ఫాలో అవుతూనే.. విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు.