బీసీ లోన్లకు చిక్కులు..! వచ్చేదెన్నడో చెక్కులు?
హైదరాబాద్ : బీసీ సబ్సిడీ లోన్లకు ఆది నుంచి ఆటంకాలే. వరుస ఆటంకాలతో చెక్కుల పంపిణీ అటకెక్కింది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం మొదలు వచ్చే జులై వరకు ఆ చెక్కులకు మోక్షం లేనట్లే కనిపిస్తోంది. ఎన్నో ఆశలతో బీసీ లోన్లకు దరఖాస్తులు పెట్టుకున్న యువతలో క్రమక్రమంగా నైరాశ్యం పెరుగుతోంది. ప్రభుత్వమిచ్చే ఆర్థిక సాయంతో సెటిలవుదామని భావించిన చాలామందికి ఈ చెక్కుల చిక్కులు తలనొప్పిగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 106 కోట్ల రూపాయల మేర రాయితీ లోన్ల మొత్తం బీసీ కార్పొరేషన్ ఖాతాలో మురిగిపోతోంది.
నిజామాబాద్ బరి.. గెలుపెవరిదో మరి? కవిత VS మధుయాష్కి VS అర్వింద్
నాలుగేళ్లుగా లేనే లేవు.. ఈసారి ఇద్దామంటే ఎన్ని కష్టాలో?
బీసీ కార్పొరేషన్ సబ్సిడీ పథకాలకు ఆది నుంచి అవరోధాలే. దాదాపు నాలుగేళ్లుగా బీసీ కార్పొరేషన్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వక రాయితీ పథకాలకు బ్రేక్ పడింది. కానీ 2018-19 వార్షిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు బాగానే విడుదల చేసింది. దాంతో బీసీ నిరుద్యోగ యువత నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
ఆ క్రమంలో తొలివిడతలో భాగంగా మొదటి కేటగిరీ కింద అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారు అధికారులు. అలా దాదాపు 41వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించిన బీసీ కార్పొరేషన్ అధికారులు.. 19వేల మందికి చెక్కులు పంపిణీ చేశారు. మిగతా 22వేల మంది లబ్ధిదారుల చెక్కులకు మాత్రం మోక్షం కలగడం లేదు. సరిగ్గా చెక్కుల పంపిణీ సమయానికి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోడ్ కూసింది. దాంతో చెక్కుల పంపిణీ డిసెంబర్ నెల వరకు అటకెక్కింది.
ఎన్నికల కోడ్.. లబ్ధిదారులకు నిరాశ
డిసెంబర్ 11న టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో చెక్కుల పంపిణీ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వ అనుమతి మేరకు లబ్ధిదారుల పేరిట కొత్త చెక్కులను సిద్ధం చేసి ఆయా జిల్లాలకు పంపింది కార్పొరేషన్. అయితే జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో మళ్లీ ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా మారింది. దాంతో మరోసారి చెక్కుల పంపిణీకి బ్రేక్ పడింది. అలా పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసిందో లేదో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు మరోసారి ప్రయత్నించారు జిల్లా అధికారులు. అందులోభాగంగా ప్రభుత్వ అనుమతి కోరారు. అయితే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడంలో ఆలస్యం కావడంతో అంతలోపే పార్లమెంటరీ ఎన్నికల కోడ్ వచ్చేసింది.
మళ్లీ మొదటికేనా?.. ఇంతట్లో చెక్కులు రానట్లేనా?
బీసీ కార్పొరేషన్ ఇచ్చే ఆర్థిక సాయంతో స్వయం ఉపాధి పొందుదామనుకున్న నిరుద్యోగ యువత ఆశలు ఆడియాసలవుతున్నాయి. నెలలకొద్దీ చెక్కుల పంపిణీ ఆలస్యం అవుతుండటం వారిని కుంగదీస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే నెల చివరి వరకు ఎన్నికల కోడ్ అమలు కానుంది. అదలావుంటే ఫైనాన్షియల్ ఇయర్ మరో 10 రోజుల్లో ముగియనుండటం కూడా మరో మైనస్ పాయింట్.
ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన నిధులు ఖర్చు చేయని పక్షంలో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి చేరతాయి. అలా కథ మళ్లీ మొదటికి వస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు పొందడం, తద్వారా కొత్త చెక్కులు తయారుచేయడం, వాటి పంపిణీకి అనుమతి తీసుకోవడం.. ఇలా ఆ ప్రక్రియ చాలా టైమ్ తీసుకునే అవకాశముంది. అదలావుంటే మే నెల తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రానుండటంతో జులై, ఆగస్టు వరకు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ లేనట్లే కనిపిస్తోంది.