ఎన్నికల సంఘం సీఈఓ అసంతృప్తి.. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కారణమా?
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి అరెస్ట్ పర్వం ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్ కలతకు కారణమైంది. హైకోర్టుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తప్పుబట్టిన నేపథ్యంలో ఆయన కలతకు గురైనట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ ఆయనను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల కోసం మూడు నెలలుగా కష్టపడ్డ శ్రమకు రేవంత్ రెడ్డి అరెస్ట్ ఘటనతో ఫలితం లేకుండా పోయిందనేది ఆయన అంతరంగమని కిందిస్థాయి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో ఈనెల నాలుగోతేదీన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను అడ్డుకోవాలనే రేవంత్ రెడ్డి పిలుపుతో అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించారట సీఈఓ. అయితే వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకోకుండా గృహ నిర్భందం చేస్తే ఇంతలా వివాదం ముదిరేది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ సీఈఓ సూచిస్తే.. ఎస్పీ మాత్రం ఒక అడుగు ముందుకేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి అరెస్ట్ ఘటనతో ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నల వర్షం కురుస్తుండటం సీఈవో అసంతృప్తికి కారణమని తెలుస్తోంది.