సర్పంచ్ కుర్చీలకు వేలం...! ఎన్నికల సంఘం సీరియస్... ఏకంగా జైలుశిక్షే
హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సర్పంచులకు ఎన్నికలు లేకుండా.. చాలాచోట్ల ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోకుండా వేలం పాటలకు సిద్ధమయ్యారు. పంచాయతీకి ఎవరూ ఎక్కువ మొత్తం ఇవ్వడానికి ముందుకొస్తారో.. వారికే సర్పంచ్ కుర్చీ. ఇక వార్డుమెంబర్లను కూడా వేలం పాటలోనే ఎంపిక చేయడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయట.
అయితే ఈ వేలం పాటల వ్యవహారం రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. దీంతో చర్యలు తప్పవని హెచ్చరించారు ఈసీ అధికారులు. పంచాయతీలకు వేలం పాటలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడమే గాకుండా తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి వేలం పాటలో పాల్గొనే అభ్యర్థులకు ఏడాది జైలుశిక్షతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తామన్నారు.
వేలం పాటలపై దృష్టి సారించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీల వేలం పాటలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించడానికి అలాగే మీడియాలో వచ్చే సమాచారంపై ఇవి సునిశితంగా పరిశీలించనున్నాయి. ఆయా జిల్లాలకు సంబంధించిన ఎన్నికల సంఘం అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా వేలం పాటలపై చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులు సూచించారు. ఇక ఏకగ్రీవ పంచాయతీల రిజల్ట్స్ ను అన్నీ ఓకే అనుకున్నాక రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని వెల్లడించారు.