సోషల్ మీడియా ఖర్చులపై నిఘా.. అభ్యర్థుల ప్రకటనలపై ఈసీ కన్ను
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఇక ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు లీడర్లు. అయితే ఎన్నికల వ్యయానికి సంబంధించి మరో బాంబ్ పేల్చింది ఎలక్షన్ కమిషన్. సోషల్ మీడియాకు వెచ్చిస్తున్న ఖర్చు కూడా లెక్కల్లో చూపాలంటోంది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు ప్రచారానికి సంబంధించిన ప్రకటన ఏదైనా సరే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే.
అవి కూడా లెక్కల్లోకే..!
సోషల్ మీడియాలో ప్రకటనల కోసం వెచ్చించే సొమ్మును ఎన్నికల వ్యయం కింద చూపాలంటోంది ఎన్నికల సంఘం. ఆ మేరకు వెబ్సైట్ మాధ్యమాల్లో ఇచ్చే ప్రకటనలు కూడా ఇకపై లెక్కల్లోకి వస్తాయి. అంతేకాదు బల్క్ ఎస్ఎంఎస్ లు, ఎఫ్ఎం రేడియోలు, సినిమా హాళ్లు ఇలా ప్రసార మాధ్యమం ఏదైనా ఖర్చు చూపించాల్సిందే.
ఇకపై అనుమతి తప్పనిసరి
సోషల్ మీడియాను ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వాడుకుంటున్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కింద చూపించడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ మేరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై దృష్టి పెట్టారు అధికారులు. ఆ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) లను నియమించారు. ఇకపై ఎన్నికల ప్రచార ప్రకటలనకు సంబంధించి ఈ కమిటీల నుంచి ముందస్తు పర్మిషన్ తప్పనిసరి చేశారు.
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల (ఫేస్ బుక్, ట్విట్టర్ etc) గురించిన వివరాలు నామినేషన్ పత్రాల్లో పొందుపరచాలి. సోషల్ మీడియా నిర్వహణ కొరకు నియమించుకునే ఉద్యోగుల జీతభత్యాలు, ఖర్చులు తదితర వివరాలకు సంబంధించి లెక్కలు చూపించాలి.
ప్రతి పోస్టు కౌంటే..!
సోషల్ మీడియా ప్రచారం ఏదైనా సరే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీల నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. సోషల్ మీడియా కోసం వెచ్చించే ఖర్చులను ఎన్నికల వ్యయం కింద చూపాలి. వెబ్సైట్ మాధ్యమాల్లో (పెయిడ్ న్యూస్) ప్రచురించే ప్రకటలనకు సంబంధించిన ఖర్చులు కూడా సవివరంగా పేర్కొవాలి. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ప్రచురితమయ్యే ప్రతి పోస్టు కూడా ఎన్నికల కోడ్ నిబంధనల పరిధిలోకి వస్తుంది.