పాలేరులో తుమ్మల భావోద్వేగం..! ఓటమికి తనదే బాధ్యత అంటూ కంటతడి..!!
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గులాబీ పార్టీ మంచి మెజారిటీ తో విజయం సాధించినప్పటికి ఓడిపోయిన హేమాహేమీల్లాంటి నేతలు అంతర్గతంగా కుమిలి పోతున్నారు. పార్టీకి ప్రజల్లో ఇంత సానుకూల వాతావరణం ఉన్నప్పుడే గెలవలేకపాయామనే భావన వారిని తొలిచివేస్తున్నట్టు తెలుస్తోంది. అదికార గులాబీ పార్టీలో కీలక పదవులు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకులు కూడా ఓటమి పాలవ్వడం గులాబీ పార్టీకి అంతుచిక్కని సమస్యగా పరిణమించింది.
ఈ నేథ్యంలో ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పుతారనుకున్న మాజీ మంత్రి, సీయం చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహితుడు తుమ్మల నాగేశ్వర రావు తన ఓటమి గురించి కాస్త ఆలస్యంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని, అదే సమయంలో జిల్లా అభివృద్ధి బాధ్యత కూడా తానే తీసుకుంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
తాజా ఎన్నికల్లో ఓటమి అనంతరం తుమ్మల నాగేశ్వర రావు పాలేరులోని నాయుడుపేటలో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తల నినాదాల మధ్య భావోద్వేగానికి గురైన ఆయన చెమర్చిన కళ్లతో ప్రసంగించారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పార్టీ పరాజయం ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆవేదనకు గురిచేసిందన్నారు. పంచాయతీ, సహకార, లోక్సభ ఎన్నికల్లో తిరిగి పార్టీని గెలిపించడం ద్వారా పోయిన గౌరవాన్ని తిరిగి దక్కించుకోవాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి సహకారం ఉన్నంతవరకు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచుతానని చెప్పారు. తుమ్మల ప్రసంగిస్తున్నంత సేపు కార్యకర్తలు 'జై తుమ్మల' అంటూ నినాదాలు చేశారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వర్గీయులపై చర్యలు తీసుకోవాలంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కాగా తెలంగాణ మంత్రి వర్గంలో తుమ్మల కు కేసీఆర్ మళ్లీ అవకాశం ఇచ్చే అంశం పై కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.