టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్..!! నిలిచిపోయిన విలీన ప్రక్రియ, నోటీసు ఇచ్చిన ఈయూ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగబోతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఇతర డిమాండ్లను పరిష్కరించకపోవడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి .. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది. తాజాగా ఎంప్లాయీస్ యూనియన్ కూడా సమ్మె నోటీసు అందజేయడంతో .. సమ్మె తప్పదని కార్మిక సంఘ నేతలు అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం కూడా సముఖుత వ్యక్తం చేసింది. కానీ విలీన ప్రక్రియ అడుగులు మాత్రం ముందుకు పడటం లేదు. దీంతో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు జారీచేసింది. ఈ క్రమంలో ఇవాళ ఎంప్లాయీస్ యూనియన్ కూడా సమ్మె నోటీసు ఇచ్చింది.
బస్ భవన్లో ఆర్టీసీ మేనేజ్మెంట్కు యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ పరిరక్షణకు సంస్థ కృషి చేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ విలీనానికి 2013 అక్టోబర్లోనే జీవో విడుదలైందని గుర్తుచేశారు. కానీ విలీన ప్రక్రియ మాత్రం జరగడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి .. కానీ విలీన ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని విమర్శించారు.