గదిలో రక్తపు మరకలు..బ్లేడ్లు: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మిస్సింగ్
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్లో గల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి జీవన్ రెడ్డి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. రెండు రోజులుగా తమ కుమారుడు కనిపించట్లేదని తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీవన్ రెడ్డి కనిపించట్లేదనే విషయాన్ని రెండు రోజుల తరువాత కళాశాల యాజమాన్యం తమ దృష్టికి తీసుకొచ్చారని అతని తల్లిదండ్రులు చెబుతుండటం ప్రాధాన్యతను సంతరించకుంది.
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు జీవన్ రెడ్డి. మేడ్చల్లో ఉన్న హరిహర బాయ్స్ హాస్టల్లో తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. జీవన్ రెడ్డి కనిపించట్లేదనే విషయాన్ని హరిహర హాస్టల్, ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం అతని తల్లిదండ్రులకు ఈనెల 11వ తేదీన సమాచారం అందించారు. తమ బంధువులతో పాటు జీవన్ రెడ్డి స్నేహితుల వద్ద కూడా ఆరా తీసినప్పటికీ.. ఎలాంటి ఫలితం కనిపించలేదు.
దీనితో జీవన్ రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా జీవన్ రెడ్డి నివసిస్తోన్న హరిహర బాయ్స్ హాస్టల్్లోని అతని గదిని పరిశీలించారు. జీవన్ రెడ్డి గదిలో పెద్ద సంఖ్యలో బ్లేడ్లు కనిపించాయి. అతని దుస్తులపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతం అటు పోలీసులను, ఇటు జీవన్రెడ్డి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
దర్యాప్తు సందర్భంగా కొన్ని కీలక విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. జీవన్రెడ్డి మూడు రోజులుగా ఎవరితో మాట్లాడకుండా, ముభావంగా ఉన్నాడని హాస్టల్ సిబ్బంది తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి అతను కనిపించట్లేదని తెలిపారు. గదిలో బ్లేడ్లు గానీ, దుస్తులపై రక్తపు మరకలు గానీ ఎలా వచ్చాయనేది తెలియదని సిబ్బంది చెప్పారు. ఇంజినీరింగ్ కాలేజీ పరిసరాలతో పాటు హాస్టల్ ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని చెబుతున్నారు.