జీహెచ్ఎంసీ ఎన్నికల సిత్రాలు..పూలమ్మిన మంత్రి, టీఆర్ఎస్ నేతల ఫీట్లు
హైదరాబాద్: జీహెచ్ఎం ఎన్నికల్లో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అనేక ఫీట్లు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తోపాటు పార్టీ నేతలు ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
టాలీవుడ్ బాధ్యత మాదే, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ స్థానం: చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్
పూలు అమ్మిన మంత్రి ఎర్రబెల్లి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగాపురం కాలనీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలు అమ్మారు. పూలను అమ్ముతూనే ప్రజలను ఓట్లు అడిగారు. మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ టీఆర్ఎస్ అభ్యర్థి జెర్రి పోతుల ప్రభుదాస్తో కలిసి, ఇంటింటికీ తిరుగుతూ, ప్రతి ఓటరును కలుస్తున్నారు. ఓటర్లతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ.. యువతని ఉత్సాహపరుస్తూ, కాలనీల్లో కలియతిరుగుతున్నారు మంత్రి ఎర్రబెల్లి. ఓటర్ల పనుల్లో, వారి కార్యక్రమాల్లో మమేకమవుతూ.. ఆయా కాలనీల్లో పర్యటించారు. మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ టీఆర్ఎస్ అభ్యర్థిని కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కేసీఆర్ లాంటి సీఎం ఉండటం అదృష్టం...
మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, కేటీఆర్ల సహకారంతో మొత్తం హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ మంచి పరిపాలకుడని అన్నారు. ఆయన ప్రజల సంక్షేమం కోసం చాలా ముందు చూపుతో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మన అదృష్టమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మీరు అడగకున్నా.. మీ కష్టాలు తెలుసు కాబట్టి మీ కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రకటించిన కొత్త పథకాలు ప్రజలకు మేలు చేస్తాయన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల వరాలు..
డిసెంబర్ నుంచి జీహెచ్ఎంసీ ప్రజలందరికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి సరఫరా ఇస్తామని చెప్పారు. ఈ డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 67వేల సెలూన్లకు ఉచిత విద్యుత్, రజకులకూ ఉచిత విద్యుత్, ఉచిత నీరు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కరోనా సమయంలో నష్టపోయిన అన్ని షాపులకు 6 నెలల కరెంట్ బిల్లుల నుంచి మినహాయింపు ఇస్తామన్నారు. కరోనా సమయంలో నడవని వాహనాలకు టాక్స్ మినహాయింపు కల్పిస్తామన్నారు. మూసీ నది ఆధునీకరణకు నిర్ణయించామన్నారు. ఇలాంటి అనేక పథకాలతోపాటు హైదరాబాద్ నగరాన్ని విశ్వ వ్యాప్త నగరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
హైదరాబాద్లో చరిత్రలో జరగని అభివృద్ధి..
దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో రెండో రాష్ట్రంగా తీర్చిద్దారని మంత్రి తెలిపారు. మినీ ఇండియా లాంటి హైదరాబాద్ను అగ్రగామిగా చేశామన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్నందునే లక్షల కోట్ల పెట్టుబడులు మన హైదరాబాద్కే వస్తున్నాయన్నారు ఎర్రబెల్లి. హైదరాబాద్ చరిత్రలో ఇంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని మంత్రి ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. అందుకే, ప్రజలు ఆలోచించి, అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేయాలన్నారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జీహెచ్ఎంసీని మరింతగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.