ఎనిమిదో వికెట్: ఈఎస్ఐ స్కాంలో సురేంద్రనాథ్ అరెస్ట్, వెలుగులోకి ఆడియో టేపు
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ఒక్కొక్కరి లీలలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ సహా ఏడుగురిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ బాబును అరెస్ట్ చేశారు. ఆయన ఆడియో టేపులు బయటకు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు.
ఈఎస్ఐ మందుల కొనుగోలుకు సంబంధించి రూ.10 కోట్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అవినీతి బాగోతంలో తీగ లాగితే డొంక కదులుతుంది. ఇవాళ సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ బాబును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి సురేంద్రను దేవికారాణిని అదుపులోకి తీసుకున్నప్పుడే అరెస్ట్ చేయాలని అధికారులు భావించారు. కానీ ఆధారాలు లభించకపోవడంతో వదిలేశారు. సురేంద్ర మాట్లాడిన ఆడియో టేపు వెలుగులోకి రావడంతో అరెస్ట్ చేశారు.
నకిలీ బిల్లులు సృష్టించడం, అవసరం లేకున్నా మందుల ఇండెట్ పంపాలని వైద్యులు, ఉద్యోగులను సురేంద్రనాథ్ బాబు బెదిరించినట్టు ఆడియో టేపు వెలుగులోకి వచ్చింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మెడికల్ క్యాంపు నిర్వహించకుండా సురేంద్రనాథ్ వసూళ్లకు పాల్పడ్డారని తెలుస్తోంది. 12 ఫార్మాసిస్టులను బెదిరించి బిల్స్ కూడా సృష్టించాడని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి సురేంద్రనాథ్ బాబు ఆర్సీపురం డిస్పెన్షరీలో పనిచేయాలి. అలాకాకుండా దేవికారాణి కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఇక్కడ దేవికారాణి అండతో అందరినీ బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడు. సురేంద్రనాథ్ అవినీతి లీలలు వెలుగులోకి రావడంతో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.