ఔను వాళ్లిద్దరూ కలిశారు.. చాలా రోజుల తర్వాత.. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఇలా..!
హైదరాబాద్ : సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలుసుకున్నారు. ముఖ్యమంత్రిని, మంత్రి కలవడం పెద్ద వార్త కాకపోయినా.. వీరిద్దరి తాజా కలయిక మాత్రం హాట్ టాపిక్. ఎందుకంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఓ మంత్రిగా ఈటల రాజేందర్ కలవక చాలా రోజులవుతోంది. అందుకే వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు మంత్రివర్గ విస్తరణ సమయంలో సీఎం కేసీఆర్ను మంత్రి ఈటల రాజేందర్ కలవడం చర్చానీయాంశమైంది. ఈటలకు మంత్రి పదవి ఊస్టింగే అనే ప్రచారం చేస్తున్నవాళ్లకు వీరిద్దరు కలిసి షాక్ ఇచ్చినట్లైంది.
ఎన్నాళ్లకెన్నాళ్లకు కేసీఆర్ దర్శన భాగ్యం..!
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్కు కూడా అంతేస్థాయిలో పేరుంది, ఆయనంటే జనాల్లో గౌరవం కూడా ఉంది. సౌమ్యుడిగా ముద్రపడ్డ ఈటల రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. కరడుగట్టిన ఉద్యమకారుడిగా.. కేసీఆర్ కూడా వెళ్లలేని ప్రాంతాలకు ఈటల వెళ్లి ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. అంతేకాదు ఆరు సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారంటే ఆయన ఓ నేతగా ప్రజాభిమానం ఎంత కూడగట్టుకున్నారో ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఉద్యమ నేపథ్యం మొదలు రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీకి, అటు కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచిన ఈటలకు ఇటీవల సముచిత ప్రాధాన్యం దక్కడం లేదనే వాదనలున్నాయి. ఆయనకు కేసీఆర్ దర్శన భాగ్యం కలిగి కూడా చాలా రోజులు అవుతోందనే టాక్ నడుస్తోంది.
డాక్టర్ నుంచి రాజ్ భవన్ దాకా.. రాజకీయాల్లో చురుకుగా.. తెలంగాణ కొత్త గవర్నర్ ప్రస్థానం
గులాబీ ఓనర్లమంటూ రచ్చ.. మనస్పర్థలు వచ్చాయా.. లేదంటే..!
ఇటీవల హుజురాబాద్ టీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో ఈటల చాలా ఉద్విగ్నంగా మాట్లాడారు. గులాబీ ఓన్లరము తామేనంటూ తన మనసులోని ఆవేదనంతా వెళ్లగక్కినట్లుగా ఆయన మాట్లాడిన తీరు రచ్చ రచ్చయింది. అంతేకాదు కేసీఆర్కు, ఆయనకు మనస్పర్థలు వచ్చాయా అనే రీతిలో ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి.
వాస్తవానికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సమయంలో పలువురు మంత్రులను ఎంపిక చేసిన కేసీఆర్.. ఒక ఈటలకు తప్ప మిగతావారికి ముందస్తుగానే సమాచారం పంపించారట. ఈటలకు మాత్రం రాత్రి 10 గంటల సమయంలో కబురు అందిందట. అంటే అంతవరకు ఆయన మంత్రి పదవిపై ఊగిసలాట ధోరణి కనబరిచారనే వాదనలు లేకపోలేదు. అలా ఇద్దరి మధ్య ఆంతర్యం పెరిగిందనేది కొందరి వాదన.
కొత్త రెవెన్యూ చట్టం లీకులా.. ఇద్దరి మధ్య దూరం పెంచిందా?
అదలావుంటే ఇటీవల కలెక్టర్ల సమీక్షా సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం గురించి తనకు సన్నిహితుడైన రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయకుడికి ఈటల లీకులు ఇచ్చారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. అసలు ఆ విషయం బయటకు రావొద్దని సమావేశంలో కేసీఆర్ క్లియర్ కట్గా చెప్పినప్పటికీ ఈటల మాత్రం విస్మరించారనేది కేసీఆర్ కోపానికి కారణమట. ఈ విషయం మీడియాలో రావడం.. హుజురాబాద్ సమావేశంలో ఈటల అలా మాట్లాడటం.. వారిద్దరి మధ్య మరింత దూరం పెంచుతోందనే వాదనలు చక్కర్లు కొట్టాయి.
ఇద్దరి భేటీతో ఆ ప్రచారాలన్నీ.. ఇంతకు ఎందుకు కలిశారంటే..!
అలాంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్తో మంత్రి ఈటల రాజేందర్ ప్రగతి భవన్లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కాలం తర్వాత వీరిద్దరు కలుసుకోవడం, చర్చించడం చర్చానీయాంశమైంది. మంత్రివర్గ విస్తరణ మరోసారి జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ హాట్ టాపికైంది. అదలావుంటే ఈసారి కేబినెట్ విస్తరణలో భాగంగా పాత మంత్రులు ఒకరిద్దరికి ఊస్టింగ్ తప్పదనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈటల, కేసీఆర్ను కలవడం బిగ్ న్యూస్గా మారింది. అయితే రాష్ట్రంలో వ్యాధులు, విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ అంశంపై చర్చించేందుకే ఆయన కేసీఆర్ను కలిశారని, కేసీఆర్ పిలుపు మేరకే ఈ భేటీ జరిగిందని ఈటల సన్నిహితులు చెబుతున్న మాట. మొత్తానికి ఇద్దరి మధ్య రాజీ కుదిరిందా.. ఈటల బెర్త్ సేఫేనా.. అన్నది మంత్రివర్గ విస్తరణ తర్వాత తేలనుంది.