బీజేపీతో పవన్ కల్యాణ్ మైండ్ గేమ్ -రాష్ట్ర నేతలకు చుక్కలు -కేంద్రంతోనే డీల్ -గ్రేటర్లాగే తిరుపతిలోనూ
ఒకప్పుడు టీడీపీ చీఫ్ చంద్రబాబుతో అంటకాగిన జనసేనాని పవన్ కల్యాణ్.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒటరిగా పోటీచేసి.. దారుణంగా దెబ్బతిన్న తర్వాత.. బీజేపీ పంచన చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థించడానికే జనసేన పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుందని ప్రకటించిన పవన్.. ఇటీవలి కాలంలో బీజేపీ స్థానిక నేతల్ని లెక్క చేయకుండా తనదైన మైండ్ గేమ్ అనుసరిస్తున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు సంబంధించిన కార్యకలాపాల ద్వారా ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కన్ఫ్యూజన్లో ఉన్న జనసైనికులను పవన్ మరింత గందరగోళానికి గురిచేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..
జగన్కు సెగ గడ్డలా నిమ్మగడ్డ -కుక్క అనడం కొడాలి నాని తప్పుకాదు :ఎంపీ రఘురామ అనూహ్యం
పొత్తు అంటూనే పోటీ..
దేశానికి బలమైన నాయకత్వం అవసరమని, ఆ బలమైన నేత ప్రధాని మోదీ ఒక్కరేనని, అందుకే జనసేన బేషరతుగా బీజేపీతో కలిసి పనిచేస్తుందని, ఈ పొత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుందని గతంలో బల్లగుద్ది చెప్పారు. అటు ఏపీ బీజేపీ, ఇటు తెంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తరచూ తమ ప్రకటనల్లో జనసేనాని పవన్ తో పొత్తును, స్నేహాన్ని క్రమం తప్పకుండా ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే పేరుకు పొత్తు ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్.. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీని సమర్థించాలని జనసైనికులకు పిలుపు ఇవ్వలేదు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల్ని పోటీకి దింపారు. అటు ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోనూ జనసేన బరిలోకి దిగుతుందని పార్టీ నేతలు కరాకండిగా చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ..
స్థానిక నేతలతో జాన్తా నై?
బీజేపీతో పొత్తు ఉంటుందని కొంతకాలంగా చెబుతూ వచ్చిన పవన్.. గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేనను పోటీకి దించడమే సంచలనం అనుకుంటే.. అంతకంటే అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. కానీ అంతకు ముందు కొనసాగిన హైడ్రామా పవన్ మైండ్ గేమ్ కు తార్కాణంగా నిలిచింది. గ్రేటర్ లో జనసేనను పోటీ నుంచి తప్పుకునేలా ఒప్పించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ గత రెండు రోజులుగా తీవ్ర ప్రయత్నం చేశారు. ఒక దశలో పవన్ నివాసానికి వెళ్లి చర్చలు కూడా చేశారు. కానీ అప్పుడు పవన్ కరగలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సంజయ్.. జనసేనతో పొత్తు పెట్టుకోవడంలేదని బాహాటంగా చెప్పేశారు. మళ్లీ అంతలోనే.. బీజేపీతో పొత్తు ఉంటుందని జనసేన పల్టీ ప్రకటన చేసింది. తిరుపతి లోక్ సభ స్థానంలో జనసేన పోటీకి దిగుతుందని నేతలు చెప్పడం కూడా నాటకీయ పరిణామాల కోసమేననే వాదన వినిపిస్తోంది. మొత్తంగా అటు ఏపీలోగానీ, ఇటు తెలంగాణలోగానీ, బీజేపీ స్థానిక నేతల్ని పవన్ తనదైన రీతిలో ముప్పుతిప్పలు పెడుతుండగా, చివరికి..
కేంద్ర పెద్దలతోనే డీల్ అన్నట్లుగా..
గ్రేటర్ లో పొత్తు విషయమై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, జనసేన పార్టీల మధ్య ట్విటర్ లో కొద్ది గంటలపాటు మాటల యుద్ధం నడిచింది. చివరికి కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగిన తర్వాతగానీ పవన్ కల్యాణ్ మెత్తబడలేదు. హైదరాబాద్ లోని నాదెండ్ల మనోహర్ నివాసానికి వచ్చిన కిషన్ రెడ్డి.. గ్రేటర్ బరి నుంచి తప్పుకునేలా జనసేనానిని ఒప్పించారు. ఈ భేటీలో బీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో మీటింగ్ తర్వాతే గ్రేటర్ నుంచి జనసేన తప్పుకుంటుందని చెప్పిన పవన్.. జాయింట్ ప్రెస్ మీట్ లో బండి సంజయ్ పేరును కనీస మాత్రాంగానైనా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశం అయింది. అటు తిరుపతిలోనూ బీజేపీ స్థానిక, రాష్ట్ర నేతల అభీష్టానికి విరుద్ధంగా, మిత్రధర్మాన్ని పక్కన పెడుతూ జనసేన పోటీకి సిద్ధం కావడం ద్వారా.. కేంద్ర మంత్రులు, కేంద్ర పెద్దలతోనే తాను డీల్ చేస్తాను తప్ప.. లోకల్ నేతల్ని పట్టించుకోబోనని పవన్ సంకేతాలిచ్చినట్లయింది.
గ్రేటర్లాగే తిరుపతిలో డ్రాప్ అవుతారా?
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీపై పవన్ నేరుగా ప్రకటన చేయలేదు. ఆ మాటకొస్తే గ్రేటర్ లో పోటీపైనా పవన్ నేరుగా కామెంట్లు చేయలేదు. మొదట చిన్న నేతలతో లీకులు ఇప్పించి, ఆ తర్వాత పార్టీ అధికారిక ప్రకటనకు సిద్ధమైంది. గ్రేటర్ వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యంతో పవన్ చల్లబడ్డారు. తిరుపతిలో పోటీ విషయంలోనూ బీజేపీ నుంచి పవన్ ఇదే తరహా ప్రతిస్పందన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు తరచూ పవన్ పేరును ప్రస్తావిస్తున్నా, జనసేన మాత్రం సోము పట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శించడంలేదు. మితృత్వం అనేది బీజేపీ నేతల ప్రకటన వరికే పరిమితం అయిపోయిందని, బీజేపీ స్థానిక నేతల నుంచి తన స్థాయికి తగిన ప్రాధాన్యం లభించడంలేదనే అసంతృప్తిలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక బీజేపీ నేతలకు తన విలువేంటో తెలియజెప్పేందుకే జనసేనాని పవన్ కల్యాణ్ గ్రేటర్, తిరుపతి ఎన్నికలను అవకాశంగా తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు
పవన్కు సినిమాలే కరెక్టా?
గ్రేటర్ హైదరాబాద్, తిరుపతి ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం, మైండ్ గేమ్ ఏమిటో అర్థంకాక జనసైనికులు గందరగోళానికి గురవుతున్నారు. గ్రేటర్ లో జనసేన తరఫున ఇప్పటికే నామినేషన్లు వేసినవారిని ఉపసంహరించుకోవాలని పవన్ చెప్పడంతో అభ్యర్థులు ఖిన్నులయ్యారు. అర్ధాంతరంగా ఇలాంటి ప్రకటన చేయడం వల్ల అందరూ ఇబ్బంది పడతారని తెలిసినప్పటికీ, పోటీ నుంచి విరమించుకోవడం తప్పడంలేదని, ఇందుకు పార్టీ క్యాడర్ నిరాశ చెందొద్దని పవన్ స్వయంగా అన్నారు. తనకు పారిపోవడం తెలీదని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని పదే పదే చెప్పే పవన్.. బీజేపీ స్థానిక నేతలతో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఎన్నికల సందర్భాన్ని వాడుకోవడం, తీరా కేంద్ర మంత్రులు తనను కలిసిన తర్వాత మెత్తబడటం లాంటి పరిణామాలపై జనసేనలో అంతర్గతంగా తీవ్ర చర్చ నడుస్తున్నది. గడిచిన వారం రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలు.. పవన్ రాజకీయంగా ఏమాత్రం పరిణితి సాధించలేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని, బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ పోటీకి సిద్దపడి.. మళ్లీ పొత్తు ఒప్పందాల మరకు పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పడం ద్వారా పవన్ తన సైన్యానికి ఏం సందేశం ఇవ్వదలిచారో అర్థం కావడంలేదని, ఆయనకు రాజకీయాలకంటే సినిమాలే కరెక్టనే తరహాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తిరుపతి ఉపఎన్నిక: వైసీపీకి షాక్ -బల్లి కుటుంబానికి అన్యాయం -'క్రిస్మస్' కుట్ర: వైసీపీ ఎంపీ ఆరోపణలు