భూమా అఖిలప్రియ రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు.. బెయిల్ పిటిషన్
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం కేసీఆర్ బంధువు, హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్రావు, అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల రిపోర్టులో ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయినందునే అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. అనంతరం పోలీసులు ఆమెను జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు.
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ఏ2 గా ఉండగా.. ఆమె భర్త భార్గవ్రామ్ ఏ3గా, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఏ1 ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని సాయంత్రం హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. భార్గవ్రామ్ పరారీలో ఉన్నాడు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అఖిలప్రియ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కిడ్నాప్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అఖిలప్రియ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో బెయిల్ పిటిషన్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై గురువారం సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది.
Recommended Video
మంగళవారం రాత్రి ప్రవీణ్రావు (51), సునీల్రావు (49), నవీన్రావు (47)ను దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులం అని లోపలికి వచ్చారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించారు. తర్వాత ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. వెంటనే ఇంటికి చేరుకున్న నార్త్జోన్ డీసీపి, సెంట్రల్ జోన్ డీసీపీ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి.. ప్రవీణ్ రావును కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు.