కోవిడ్ నిబంధనల ఉల్లంఘనతో బార్ సీజ్ .. మాస్కులు లేకుండా, గుంపులుగా జనం .. షాకింగ్ వీడియో
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో పాటు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా చాలాకాలం పాటు బార్లు, పబ్ లు మూత పడిన విషయం తెలిసిందే. ఇటీవల బార్లు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు మళ్లీ బార్ల బాట పట్టారు. అయితే కరోనా నిబంధనలను బార్ నిర్వాహకులు, బార్లకు వెళుతున్న కస్టమర్లు పాటించాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత బార్ నిర్వాహకులు తీసుకోవాలని కోవిడ్ నిబంధనలను జారీ చేసిన అధికారులు హైదరాబాద్లోని ఓ బార్ పై కొరడా ఝుళిపించారు.
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన .. రిజైన్ స్కై బార్ సీజ్
కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు రిజైన్ స్కై బార్ ను అధికారులు సీజ్ చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా బార్లను నిర్వహించాల్సి ఉన్నా నిర్వాహకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బార్ లో పనిచేసే వెయిటర్ లు మాస్కులు ధరించలేదని అధికారులు గుర్తించారు. అంతేకాదు బార్ కౌంటర్ దగ్గర పరిమితికి మించి జనం గుమికూడి ఉండటాన్ని కూడా నిర్ధారించుకున్నారు. రిజైన్ స్కై బార్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో దీనిపై చర్చ జరిగింది .
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
బార్ లో పరిస్థితి ఎలా ఉందో దానికి సంబంధించిన వీడియో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చేరింది. దీంతో బార్ నిర్వహణ తీరు అటు సిబ్బందిని, కస్టమర్లను కరోనా వైరస్ బారిన పడే ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉన్న కారణంగా, ఆ వీడియోను ఎక్సైజ్ శాఖకు పంపిస్తూ దర్యాప్తు చేయవలసిందిగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీంతో బార్ లో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిబంధలను పాటించటం లేదని నిర్ధారణకు వచ్చారు .
కేసు నమోదు .. కరోనా రూల్స్ ఉల్లంఘిస్తే ఉక్కుపాదమే
తెలంగాణ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 31(1), 41, ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2005లోనే రూల్స్ 33, 38 ప్రకారం బార్ యజమాన్యం పై నెంబర్ 36/ 2020 క్రింద కేసు నమోదు చేశారు. బార్ ను సీజ్ చేశారు. ఎవరైనా కరోనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలకు వెనకాడబోమని అధికారులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని తేల్చి చెప్తున్నారు .