కరోనా: ప్రైవేటు దోపిడీపై కేసీఆర్ కొరడా - సోమాజిగూడ దక్కన్ ఆసుపత్రిపై వేటు
కరోనా మహమ్మారి పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనల్ని క్యాష్ చేసుకుంటూ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతోన్న ప్రైవేటు ఆస్పత్రులపై కేసీఆర్ సర్కారు కొరడా ఝుళిపించింది. అధిక ఫీజులు, బెదిరింపులు, నకిలీ దందాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కరోనా చికిత్సల విషయంలో ప్రైవేటు యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిందే తడవుగా సోమవారం తొలిసారి ఓ కార్పొరేట్ ఆస్పత్రిపై వేటు వేసింది.
కొవిడ్-19 ట్రీట్మెంట్ కు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తేలడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని దక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ఆరోగ్య శాఖ వేటు వేసింది. కొవిడ్-19 చికిత్స కోసం దానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేశామని, ఇకపై కొత్త రోగులెవరినీ అక్కడ చేర్చుకోరాదని, ఇప్పటికే చికిత్స పొందుతున్నవాళ్ల నుంచి నిర్దేశిత ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ.శ్రీనివాస రావు ఆదేశించారు.
కరోనా షాకింగ్: దేశంలో రెండో దశ ఉత్పాతం - అంచనా వేయలేమన్న ఐసీఎంఆర్ - భిన్నంగా వైరస్ తీరు..
ఒక వేళ తాజా ఉత్తర్వులకు విరుద్ధంగా కొత్త రోగుల్ని చేర్చుకున్నా, ఉన్నవాళ్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినట్లు తెలిసినా మొత్తం ఆస్పత్రి లైసెన్సునే రద్దు చేసేస్తామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. దక్కన్ ఆస్పత్రిలో అక్రమాలకు సంబంధించి ఇటీవల చాలా ఫిర్యాదులు వచ్చాయి. కొద్ది రోజుల కిందట, సత్యనారాయణ అనే వ్యక్తి కొవిడ్ బారినపడి చనిపోగా, రూ.10 లక్షలు కట్టినా మృతదేహం అప్పగించేందుకు మరో రూ.2 లక్షలు అడిగారని బాధిత కుటుంబీకులు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై హైదరాబాద్ డీఎంఅండ్ హెచ్ వో విచారణ జరపగా, వేధింపులు నిజమేనని నిర్ధారణ కావడంతో కొవిడ్ సేవల ఆస్పత్రుల జాబితా నుంచి దక్కన్ ఆస్పత్రిని తొలగించారు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో.. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై ఇప్పటికే కొందరు హైకోర్టును సైతం ఆశ్రయించడం, ఈ విషయమై ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రుల్లో ఎంక్వైరీలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేసింది. దక్కన్ ఆస్పత్రిపై వేటుతో మొత్తం కార్పొరేట్ రంగానికి వార్నింగ్ ఇచ్చినట్లయింది.
పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర - బీజేపీ వెన్నుపోటు, పవన్ నాయకత్వం - పద్మశ్రీ సంచలనం
Recommended Video
రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 983 మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 67,660కి పెరిగింది. ఇప్పటిదాకా 2,504మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అత్యధిక రికవరీ రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఒకటి. మొత్తం కేసుల్లో ఇప్పటికే 48,609 మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 18,500గా ఉంది.