అల్లుడితో అత్త వివాహేతర సంబంధం: భర్తను పక్కా ప్లాన్తో హత్య చేసిన కాబోయే ఎస్సై!
హైదరాబాద్: కాబోయే ఎస్సై హంతకురాలిగా మారిపోయింది. మత్తులో ఉన్న భర్తను హత్యకు ప్లాన్ చేసింది. మేనల్లుడితో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆమె భర్త రైల్వే ఉద్యోగి. భర్త చనిపోతే ఉద్యోగంతో పాటు మేనల్లుడితో సుఖం దొరుకుతుందని భావించింది. ఈమె కాబోయే ఎస్సై కావడం గమనార్హం. ఈ సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రియుడు చెప్పడంతో ప్లాన్ మార్చింది
తొలుత కరెంట్ షాక్తో భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తన మేనల్లుడిని కలిసి ప్లాన్ చెప్పింది. అయితే కరెంట్ షాక్తో చనిపోడని మేనల్లుడు చెప్పడంతో ప్లాన్ మార్చింది. రైల్వే ట్రాక్ పక్కనే ఉండటంతో రైలు వచ్చే సమయానికి హత్యకు ప్లాన్ చేసింది. రైలు వచ్చే సమయంలో మేనల్లుడి సాయంతో భర్త తల పైన బండరాయితో మోదింది. మేనల్లుడు బండరాయితో మోదగా.. భార్య తన భర్త కాళ్లు, చేతులు పట్టుకుంది.
ఎస్సై పరీక్షల్లో అర్హత సాధించి.. హత్యలో ఇరుక్కుపోయింది
నిందితురాలి పేరు సంగీత. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న మేనల్లుడి పేరు విజయ్. సంగీత బీఈడి చదివింది. కొద్ది రోజుల క్రితం ఎస్సై పరీక్షల్లో అర్హత సాధించింది. చంపే సమయంలో భర్త అరుపులు వినకుండా ఉండేందుకు రైలు వచ్చే సమయంలో హత్య చేసింది. అయితే భర్తను రైలు కింద పడవేద్దామనుకున్నప్పటికీ.. అది కుదరలేదు. దీంతో రైల్వే ట్రాక్ పక్కన పడేశారు.
తొలుత ప్రమాదంగా భావించారు
ఈ నెల 2వ తేదీన రైల్వే ట్రాక్ పైన భర్త మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. తొలుత ఇది రైల్వే ప్రమాదంగా గుర్తించారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో, శవపరీక్షలో దీనిని హత్యగా గుర్తించారు. హత్య చేశాక అంత శుభ్రం చేశారు.
ఆ సమయంలో అల్లుడితో అక్రమ సంబంధం
విజయ్ 2017లో తన మేనమామ ఇంట్లో రెండు నెలల పాటు ఉన్నాడు. ఆ సమయంలో అత్తకు, అల్లుడికి అక్రమ సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఆ తర్వాత అతనిని ఇంట్లో నుంచి పంపించారు. అల్లుడిని వెళ్లగొట్టిన తర్వాత కూడా.. ఆ భార్య తన ప్రియుడు వచ్చి వెళ్లేందుకు గోడకు చిన్న కన్నం కూడా పెట్టారట. భర్తను హత్య చేస్తే అతని ఉద్యోగం రావడంతో పాటు ప్రియుడు అయిన అల్లుడితో ఎప్పటికీ ఉండవచ్చునని భావించి ఉంటారని చెబుతున్నారు.
కేసు ఇలా వెలుగు చూసింది.
పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేశారు. ఈ హత్య మూడు రోజుల క్రితం జరిగింది. మృతుడు రైల్వే ట్రాక్కు కొద్ది దూరంలో పడ్డాడు. తొలుత ప్రమాదంగా భావించినా, ఆ తర్వాత పూర్తిగా విచారణ జరిపారు. విచారణలో మృతుడి సోదరుడు కొత్త విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. తమ వదినకు, మేనల్లుడికి అక్రమ సంబంధం ఉందని చెప్పారని తెలుస్తోంది. ఈ కోణంలో దర్యాఫ్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించారు.