వాహనదారులకు షాక్.. "ఫేక్ న్యూస్" ఎంత పని చేసిందో తెలుసా..!
హైదరాబాద్ : ఫేక్ న్యూస్ తికమక పెడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా రాజ్యమేలుతున్నాయి. పనిపాటా లేని కొందరు చేసే ఆకతాయి వేషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆ క్రమంలో ఇటీవల వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన ఓ మేసేజ్ తో చాలామందికి టైమ్ వేస్టయింది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో విధించే చలాన్లకు 50 శాతం రాయితీ ఉందంటూ ఇటీవల వాట్సాప్ లో వైరల్ అయింది ఒక మేసేజ్. దీంతో ఆదివారం హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంకు చేరుకున్నారు వాహనదారులు. లోక్ అదాలత్ వేదికగా ఈ రాయితీ ఉంటుందని.. అందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలనేది ఆ మేసేజ్ సారాంశం. 50 శాతం డిస్కౌంట్ అనగానే చాలామంది అట్రాక్ట్ అయ్యారు. 23వ తేదీ మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుందని అందులో పేర్కొనడంతో చాలామంది గోషామహల్ కు వచ్చారు. తీరా అది ఫేక్ న్యూస్ అని తెలిసి ఏంచేయాలో తోచక ఓ నిట్టూర్పు విడుస్తూ వెళ్లిపోయారు.
దాదాపు వారం, పదిరోజుల కిందట ఈ ఫేక్ న్యూస్ వాట్సాప్ లో బాగా వైరలయింది. అయితే అది వచ్చిన మరుసటి రోజే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఖండిస్తూ అలాంటి లోక్ అదాలత్ లేదని ప్రకటించారు. అయితే ఈ ఫేక్ న్యూస్ చూసినోళ్లు మాత్రం.. పోలీసులు రిలీజ్ చేసిన మేసేజ్ చూడలేకపోయారు. దీంతో 50 శాతం రాయితీ నిజమని నమ్మారు. చూశారా.. ఒక ఫేక్ న్యూస్ ఎలాంటి సీన్ క్రియేట్ చేసిందో. సోషల్ మీడియాలో చూసిన ప్రతిదీ నిజమనుకుంటే పొరపాటే. ఇలాంటి ఫేక్ న్యూస్ పై నలుగురితో చర్చిస్తే అసలు విషయం తెలిసే అవకాశముంటుంది.