వెటర్నరీ డాక్టర్ హత్యోదంతంపై అసభ్య పోస్టులు, కీచకులకు అనుకూలంగా, రంగంలోకి సైబర్ క్రైం...
వెటర్నరీ డాక్టర్ హత్యపై సోషల్ మీడియా వేదికగా కొందరు అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు నిందితులకు సపోర్ట్ చేస్తున్నారు. మహ్మద్, నవీన్, శివ, చెన్నకేశవులు చేసింది కరెక్టు అనేలా పేర్కొన్నారు. ఘటనలో యువతిదే తప్పనే విధంగా తప్పుడు రాతలు రాస్తున్నారు. ఆ పోస్టులపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో తప్పుడు పోస్టులు పెట్టిన వారిని పట్టుకునేందుకు సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.
అనుకూల పోస్టులు
వెటర్నరీ డాక్టర్ గ్యాంగ్రేప్, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటున్నాయి. ఘటనను యావత్ జాతి ముక్తకంఠంతో ఖండిస్తోంది. కానీ కొందరు మాత్రం నిందితులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కామెంట్ చేయడమే కాదు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. యువతిదే తప్పన్నట్టు కామెంట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా వస్తారా..?
బయటకు మహిళలు ఎలా రావాలి ? ఈ విధంగా వస్తారా అంటూ పోస్టులు పెట్టారు. అమ్మాయిల ప్రవర్తనతో వారు అలా ప్రవర్తిస్తున్నారని వెనకెసుకొచ్చారు. పోస్టులపై రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టులు ఎవరు పెట్టారనే అంశంపై విచారణ జరుపుతున్నారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
5 నిమిషాలు చాలు..
వెటర్నరీ డాక్టర్ హత్య కేసు నిందితులను జైలులో కాకుండా తమకు అప్పగించాలని విద్యార్థులు, మహిళలు కోరుతున్నారు. తమకు ఐదు నిమిషాలు అప్పగించాలని వేడుకుంటున్నారు. బాధితురాలిని ఎలా హింసించారో వారిని కూడా అలాగే చిత్రవధ చేసి హతమారుస్తామని చెప్పారు. ఇవాళ కూడా చర్లపల్లి జైలు వద్ద మహిళలు, విద్యార్థులు ఆందోళన కొనసాగింది.
ఉరి శిక్ష
వెటర్నరీ డాక్టర్ హత్య కేసు నిందితులకు కఠినశిక్ష విధించాలని సబ్బండ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫాస్ట్ట్రాక్ కోర్టు కూడా త్వరితగతిన విచారణ ముగించాలని కోరుతున్నారు. నెలల వ్యవధిలోనే ఉరి శిక్ష విధించి,, అమలు చేయాలని విన్నవిస్తున్నారు. భవిష్యత్లో మరొకరు నీచానికి తెగబడాలంటే వణికిపోవాలని సూచిస్తున్నారు. లేదంటే మరికొందరు కీచకులు రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.