బీజేపీలోకి విజయశాంతి..మాజీ డిప్యూటీ సీఎం : మాజీ ఎంపీలు..ఎమ్మెల్యేలు సైతం: 18న ముహూర్తం..!!
తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ బలోపేతం కోసం కీలక నేతలను తమ పార్టీలోకి తీసుకొనే కార్యాచరణ వేగవంతం చేసింది. కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నట్లుగా ప్రముఖ సినీ నటి..ఒకరు, టీపీసీసీ ప్రచారకమిటీ చైర్పర్సన్ విజయశాంతితోపాటు పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కమలం గూటికి చేరనున్నారు. బీజేపీ జాతీయ నేతలు వీరితో నేరుగా సంప్రదింపులు జరిపారు. వారు సైతం అంగీకరించారు. ఈ నెల 18న బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ రానున్నారు. ఆ సమయంలో కొందరు నేతలు బీజేపీలో చేరిక లాంఛనమే. ఇక..విజయశాంతి తో పాటుగా మాజీ డిప్యూటీ సీఎం..మాజీ ఎంపీలు మాత్రం అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు.
సొంత గూటికి విజయశాంతి..!!
బీజేపీలో క్రియా శీలకంగా వ్యవహరించి.. ఆ తరువాత పార్టీ మారిన విజయశాంతి తిరిగి ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలు నేరుగా అమెతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు సమాచారం. తెలంగాణ సాధన కోసం సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి..ఆ తరువాత టీఆర్ యస్ లో విలీనం చేసారు. టీఆర్ యస్ నుండి మెదక్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ సాధన సమయంలో పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. అయితే, ఆ సమయంలోనే పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవటంతో టీఆర్ యస్ ను వీడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రచారకమిటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలొ కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలోనూ విజయశాంతికి సరైన ప్రాధాన్యత లభించటం లేదు. కీలక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం అందటం లేదు. దీంతో..పార్టీ లో విలువ లేకుండా కొనసాగలేమనే అభిప్రాయానికి విజయశాంతి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నేతల నుండి సంప్రదింపులు మొదలయ్యాయి. ఇక, సొంత గూటికే చేరాలని విజయ శాంతి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే పార్టీ అధినేత అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరటం లాంఛనంగా తెలుస్తోంది.
మాజీ డిప్యూటీ సీఎం..మాజీ ఎంపీలు..ఎమ్మెల్యేలు సైతం..
తెలంగాణలో పార్టీలో కీలక నేతలను ఆహ్వానించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందు కోసం జిల్లాల వారీగా నేతల లిస్టును సిద్దం చేసుకుంది. ముఖ్య నేతల ద్వారా నేరుగా వారితో సంప్రదింపులు కొనసాగిస్తోంది. అందులో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎ్సకు చెందిన కొంతమంది ముఖ్యనేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు స్వయంగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులతో అంతర్గత చర్చలు కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మొత్తం ముగ్గురు మాజీ ఎంపీలు, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు, మరో మాజీ డిప్యూటీ సీఎంతో పార్టీ నాయకత్వం టచ్లో ఉంది. వరంగల్ జిల్లా నుండి గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన నేత ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీలో చేరటం దాదాపు ఖాయమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు కొద్దినెలల కిందట టీఆర్ఎ్సలో చేరారు. ఈయన్ను కూడా బీజేపీలోకి పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. పెద్దపల్లి టీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరితో కూడా కమలం నాయకులు చర్చిస్తున్నారు. కాగా, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్పాల్రెడ్డి మంగళవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను కలుసుకున్నారు. పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.
18న భారీ స్థాయిలో చేరికలు..
టీడీపీకి చెందిన పలువురు నియోజకవర్గ, జిల్లాస్థాయి నాయకులు 18న రాజ్యసభ సభ్యుడు గరిపాటి మోహన్రావుతో కలిసి బీజేపీలోకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 18న జరిగే భారీ సభ సందర్భంగా టీడీపీ నుంచి పెద్దఎత్తున చేరికలకు రంగం సిద్ధమవుతోంది. ఆయా పార్టీల ముఖ్యనాయకులు, సీనియర్లకు ప్రధాన వేదిక, ద్వితీయశ్రేణి నాయకులకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గరికపాటి తనతో పాటుగా దాదాపు పది జిల్లాల టీడీపీ జిల్లా కమిటీలను బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల పైనా బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ముందుగా గ్రేటర్ పరిధిలో నేతలతో నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. హోం మంత్రి అమిత్ షా సూచనలతో తెలంగాణలో పార్టీ చేరికలను పెద్ద ఎత్తున కొనసాగించేందుకు బీజేపీ నేతలు వ్యూహలు సిద్దం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా టీడీపీ మాజీ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు.