కాంగ్రెస్ కు రాములమ్మ గుడ్ బై..! బీజేపీలోకి రీ ఎంట్రీ ఖాయం: ముహూర్తం ఫిక్స్..!
కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి దాదాపు ముగింపు లభిస్తోంది. అంచనా వేసిన విధంగానే ప్రముఖ సినీ నటి..తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ వీడటం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే బీజేపీ నేతలు రాములమ్మను తిరిగి బీజేపీలోకి రావాలని మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులు..నాయకత్వం మద్య కొరవడిన సమన్వయంతో విజయ శాంతి మనస్పూర్తిగా పార్టీలో ఇమడలేకపోతున్నారని చెబుతున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు రాములమ్మ దూరంగా ఉంటున్నారు.
ట్విట్టర్ ద్వారా కేసీఆర్ మీద ..ప్రభుత్వం మీద విమర్శలు చేయటం మినహా యాక్టివ్ రాజకీయాలు చేయటం లేదు. ఇదే సమయంలో..కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే ఇక బీజేపీలోకి వెళ్లటమే మార్గంగా విజయశాంతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..రాములమ్మ బిజేపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందు కోసం ముహూర్తం సైతం ఫిక్స్ అయింది.
బీజేపీలోకి రాములమ్మ రీ ఎంట్రీ..
బీజేపీ తోనే రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ రాజకీయంగా అనేక ఒడి దుడికులు ఎదుర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం బీజేపీ నుండి బయటకు వచ్చి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసారు. ఆ తరువాత ఆ పార్టీని టీఆర్ యస్ లో విలీనం చేసి కేసీఆర్ నాయకత్వంలో పని చేసారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుండి టీఆర్ యస్ ఎంపీగా గెలిచారు. లోక్ సభలో కేసీఆర్ తో పాటుగా విజయ శాంతి మాత్రమే టీఆర్ యస్ నుండి సభ్యులుగా ఉన్నారు. అయితే, అదే సమయంలో పార్టీలో విజయశాంతి తనకు ప్రాధాన్యత తగ్గించటం పైన అసహనం వ్యక్తం చేసారు.
స్టార్ క్యాంపెయినర్ గా
ఇక, ఆ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేసారు. ఆ వెంటనే కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో తెలంగాణ ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్ గా పని చేసారు. పార్టీ అధినేత్రి సోనియా వద్ద గుర్తింపు పొందారు. మరో సారి కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత విజయశాంతి గట్టి విమర్శలే చేసారు. కానీ, కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితుల కారణంతో విజయశాంతి దూరంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు.
టచ్ లోకి బీజేపీ నేతలు..
రాములమ్మ కాంగ్రెస్ లో ఇమడ లేకపోతున్నారనే సమాచారంతో బీజేపీ నేతలు టచ్ లోకి వచ్చారు. కొద్ది కాలంగా మంతనాలు సాగుతున్నా విజయ శాంతి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడానికి బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. పలు నియోజకవర్గాల్లో తమకు పట్టులేని నేపథ్యంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నాయకులను చేర్చుకునేందుకు సాక్షాత్తూ పార్టీ జాతీయ నాయకత్వం పర్యవేక్షణలో సంప్రదింపుల పర్వం కొనసాగుతోంది.
అంతర్గత చర్చలు
బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు స్వయంగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులతో అంతర్గత చర్చలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా విజయశాంతిని బీజేపీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. రాములమ్మ తిరిగి బీజేపీలోకి రావటం ద్వారా ఆమె వాయిస్ పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు. దీంతో.. విజయశాంతి తెలంగాణ, ఢిల్లీకి చెందిన కమలనాథులు రాములమ్మతో భేటీ అయ్యి.. పార్టీలో చేరికపై చర్చించారని సమాచారం.
దసరా నాడు చేరికకు ముహూర్తం..
బీజేపీ నేతలతో సమావేశం సమయంలో కాషాయ కండువా కప్పుకోవటానికి రాములమ్మ ఓకే చెప్పారని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో.. దసరా రోజున ఢిల్లీ వేదికగా కాషాయ కండువా కప్పుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. రానున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ, అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె సేవలు వినియోగించుకోవాలనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో దసరా నాడు విజయ శాంతి చేరిక ఖాయమైతే ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నిక నుండే అటు టీఆర్ యస్ ..ఇటు కాంగ్రెస్ మీద విజయశాంతి తన మాటల తూటాలను సంధించే అవకాశం కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే విజయ శాంతి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారని చెబుతున్నారు. దీని మీద విజయశాంతి అధికారికంగా స్పందించాల్సి ఉంది.